Ponguleti Srinivas Reddy: కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను కొల్లగొట్టింది... రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది: మంత్రి పొంగులేటి

  • కొన్ని రోజుల్లోనే తాము ఆరు గ్యారెంటీల అమలు దిశగా ముందుకు సాగుతున్నామన్న మంత్రి
  • తెలంగాణవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజాపాలన నడుస్తోందని వెల్లడి
  • అధికారం ఉంది కదా అని కేసీఆర్ ఇష్టారీతిన అప్పులు చేశారని విమర్శలు
Minister Ponguleti blames KCR government for telangana debts

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను కొల్లగొట్టిందని... రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం పాలేరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే ఆరు గ్యారెంటీల అమలు దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజాపాలన నడుస్తోందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలకు సంబంధించి రెండు అంశాలను ప్రారంభించామని గుర్తు చేశారు.

తమ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని... క్రమంగా అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. ప్రజా సమస్యలు తీర్చేందుకే ఈ ప్రభుత్వం ఉందని చెప్పారు. గత ప్రభుత్వ హయాం లో తెలంగాణను కొల్లగొట్టారని ఆరోపించారు. గత పదేళ్లలో తెలంగాణ ఎంత మేర అప్పుల్లో కూరుకుపోయిందో ముందే ప్రజల్లో చర్చ పెట్టినట్లు తెలిపారు. అధికారం ఉంది కదా అని కేసీఆర్ ఇష్టారీతిన అప్పులు చేశారని... ప్రజల సొమ్ముతో పెద్ద ఇల్లు కట్టారని విమర్శించారు.

More Telugu News