Americal Premier League: అమెరికన్ ప్రీమియర్ లీగ్: డబ్బుల విషయంలో గొడవ.. పోలీసులతో అంపైర్లను మైదానం నుంచి బయటకు గెంటివేయించిన నిర్వాహకులు

  • తమకు రావాల్సిన 30 వేల డాలర్లు ఇవ్వాలన్న అంపైర్లు
  • సెమీస్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ నిర్వాహకుల ఆగ్రహం
  • బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణ
  • చివరికి ఇలా ముగిసిందన్న ఐసీసీ ప్యానల్ అంపైర్
Umpires thrown out of the ground in APL match

అమెరికన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో అంపైర్లను మైదానం నుంచి బయటకు విసిరేశారు. డబ్బుల విషయంలో లీగ్ యజమానికి, అంపైర్లకు మధ్య జరిగిన గొడవ అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. తమకు రావాల్సిన 30 వేల డాలర్లు చెల్లించలేదని అంపైర్లు ఆరోపిస్తుండగా, డౌన్ పేమెంట్ తీసుకున్న తర్వాత కూడా సెమీఫైనల్ మ్యాచ్‌ను ఆపేందుకు అంపైర్లు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని, డబ్బులు చెల్లించకుంటే మ్యాచ్‌ను జరగనీయబోమని హెచ్చరించారని ఏపీఎల్ ఆరోపిస్తోంది. ఈ గొడవతో పోలీసులను పిలిపించి అంపైర్లను మైదానం నుంచి బయటకు గెంటివేయించినట్టు నిర్వాహకులు తెలిపారు. 

అంపైర్లు డానీ ఖాన్, బ్రియ్ ఓన్స్ మాత్రం తాము ఎలాంటి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడలేదని చెబుతున్నారు. ఇదే విషయమై అమెరికాకు చెందిన ఐసీసీ ప్యానల్ అంపైర్ విజయ ప్రకాశ్ మల్లెల మాట్లాడుతూ గత 10 రోజులుగా జట్లతో పనిచేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, మిగిలిన 30 వేల డాలర్లు అంపైర్లకు చెల్లించకపోవడంతో ఇలా ముగిసినందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పోలీసులను పిలిపించి గెంటేశారని, తమకు మరో అవకాశం లేకపోవడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

More Telugu News