Margrethe ll: న్యూఇయర్ వేళ డెన్మార్క్ రాణి మార్గరెట్-2 సంచలన ప్రకటన.. సింహాసనానికి వీడ్కోలు

  • 60 లక్షల మంది లైవ్‌లో వీక్షిస్తుండగా ప్రకటించిన మార్గరెట్-2
  • ఈ నెల 14న రాజుగా కిరీటం ధరించనున్న 55 ఏళ్ల క్రౌన్‌ప్రిన్స్ ఫ్రెడెరిక్
  • రాణి నిర్ణయంతో దేశ ప్రజల షాక్
Danish Queen Margrethe 2 Announce Her Abdication

న్యూ ఇయర్ వేళ డెన్మార్క్ రాణి మార్గరెట్-2 సంచలన నిర్ణయం తీసుకున్నారు. సింహాసనం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఆమె తన వారసుడిని ప్రకటించారు. దాదాపు 60 లక్షల మంది లైవ్‌లో వీక్షిస్తుండగా మార్గరెట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆమె నిర్ణయం దేశ ప్రజలను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. 55 ఏళ్ల తన పెద్ద కుమారుడు క్రౌన్‌ప్రిన్స్‌ ఫ్రెడెరిక్ రాజుగా పగ్గాలు చేపడతాడని రాణి ప్రకటించారు.

2023 ఫిబ్రవరిలో తన వెన్నెముకకు జరిగిన శస్త్రచికిత్స భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేసిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తర్వాతి తరానికి బాధ్యతలు అప్పగించే సమయం ఆసన్నమైందని అప్పుడే అర్థమైందని పేర్కొన్నారు. పదవీ విరమణకు ఇదే సరైన సమయమన్న మార్గరెట్ జనవరి 14తో రాణిగా 52 ఏళ్లు పూర్తి కాబోతున్నాయని, అదే రోజున సింహాసనాన్ని వీడనున్నట్టు తెలిపారు. అదే రోజు తన కుమారుడు క్రౌన్‌ప్రిన్స్ ఫ్రెడెరిక్ కిరీటాన్ని ధరిస్తాడని వివరించారు.

ఇన్నేళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, 1972లో డెన్మార్క్ రాజు ఫ్రెడెరిక్-9 మరణానంతరం 31 సంవత్సరాల మార్గరెట్-2 రాణిగా కిరీటం ధరించారు. దివంగత బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 తర్వాత యూరప్‌లో అత్యధికాలం సింహాసనం అధిష్ఠించిన రాణిగా మార్గరెట్-2 రికార్డులకెక్కారు. ఆమె వయసు 83 సంవత్సరాలు.

More Telugu News