New Year: 'న్యూ ఇయర్' సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు

  • మరి కొన్ని గంటల్లో నూతన సంవత్సరాది
  • 2024కి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న హైదరాబాద్
  • ఇతరులకు ఇబ్బంది కలగకుండా వేడుకలు చేసుకోవాలన్న పోలీసులు
Police announce restrictions due to new year celebrations in Cyberabad

నూతన సంవత్సరం 2024ను ఆహ్వానించేందుకు హైదరాబాద్ నగరం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరాది వేడుకలపై ఆంక్షలు ఉన్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి స్పష్టం చేశారు. 

నేటి రాత్రి 8 గంటల నుంచి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని వెల్లడించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే, అవుటర్ రింగ్  రోడ్డు (ఓఆర్ఆర్) పై రాకపోకలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లేవారికి మాత్రం అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. 

రోడ్లపై స్టంట్లు చేసేవారిని, మితిమీరిన వేగంతో ప్రయాణించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్ ను గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు అమర్చామని వెల్లడించారు. 

వేడుకలు జరుపుకునేందుకు అనుమతి కోరిన వారికి తగిన సూచనలు చేశామని చెప్పారు. ఇతరులకు ఇబ్బంది కలగని రీతిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ అంశంలో పబ్ ల యాజమాన్యాలు బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు.

More Telugu News