Covid cases: దేశంలో ఒక్క రోజే 841 మందికి కరోనా

  • 7 నెలల తర్వాత రికార్డు స్థాయికి కేసులు
  • 4 వేలు దాటిన యాక్టివ్ కేసులు
  • కొత్త సబ్ వేరియంట్ నేపథ్యంలో పెరుగుతున్న బాధితుల సంఖ్య
India records 841 new Covid cases in 24 hours

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్త సబ్ వేరియంట్ బయటపడడంతో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 841 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,309 కు చేరింది. దాదాపు 7 నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గత మే 19న దేశంలో 845 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొత్త కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. ఇటీవల దేశంలో జేఎన్.1 సబ్ వేరియంట్ వ్యాప్తిని అధికారులు గుర్తించారు. వైరస్ తో ముగ్గురు చనిపోయినట్లు తెలిపారు.

కేరళలో ఈ వైరస్ బాధితులను వైద్యాధికారులు గుర్తించారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల్లో ఎక్కువ శాతం కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ వల్లే కేసులు పెరుగుతుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుని వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు.

More Telugu News