Alipiri: శ్రీవారి భక్తులు నిర్భయంగా రావొచ్చు: టీటీడీ డీఎఫ్ వో

  • కాలినడక మార్గంలో చిరుత సంచారం లేదని వెల్లడి
  • శేషాచల అటవీ ప్రాంతంలో రెండు సార్లు కనిపించిందన్న డీఎఫ్ వో
  • ఫారెస్ట్ సిబ్బందితో ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసినట్లు వివరణ
There Is No Trace Of Leopard In Alipiri walk path says TTD DFO

అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం లేదని, భక్తులు నిర్భయంగా తిరుమల రావొచ్చని టీటీడీ డీఎఫ్ వో శ్రీనివాసు తెలిపారు. తిరుమలలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన శనివారం స్పందించారు. ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. శేషాచల అటవీ ప్రాంతంలో చిరుత కనిపించిందని తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో చిరుత కదలికలు రికార్డయ్యాయని, గడిచిన 29 రోజుల్లో రెండుసార్లు చిరుత సంచరించిందని వివరించారు.

అదే ప్రాంతంలో ఒక ఎలుగుబంటి కూడా కనిపించిందని తెలిపారు. అయితే, మెట్ల మార్గం చుట్టుపక్కల ఎలాంటి జంతు సంచారం లేదని తెలిపారు. అయినప్పటికీ భక్తుల భయాందోళనల నేపథ్యంలో ఫారెస్ట్ సిబ్బందితో ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలిపిరి కాలిబాట మార్గంలోని 7వ మైల్ నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు ఫారెస్ట్ సిబ్బందితో పహారా ఏర్పాటు చేశామని, భక్తులు నిర్భయంగా కాలినడకన తిరుమలకు రావొచ్చని శ్రీనివాసు పేర్కొన్నారు.

More Telugu News