Fake Drugs: హైదరాబాద్ లో నకిలీ మందుల దందా

  • నాసిరకం మందులకు ప్రముఖ కంపెనీల లేబుళ్లు
  • సిటీలోని మెడికల్ షాపులకు అమ్మకం
  • ముఠా గుట్టురట్టు చేసిన డ్రగ్ కంట్రోల్‌ అధికారులు
  • నలుగురి అరెస్ట్.. రూ.26 లక్షల విలువైన మందులు సీజ్
Fake Drug Rocket Busted In Hyderabad

నాసిరకం మందులను తెప్పించి వాటికి ప్రముఖ కంపెనీల లేబుళ్లను వేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. నిందితుల ఇళ్లు, గోడౌన్ లలో తనిఖీలు చేసి లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ ఏరియాలలో శుక్రవారం ఈ దాడులు చేశారు. ఈ దందా నిర్వహిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి మీడియాకు వివరించారు.

నిందితులు ఉత్తరాఖండ్ నుంచి నకిలీ మందులను నగరానికి తెప్పిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ గ్యాంగ్ కార్యకలాపాలకు సంబంధించి పక్కా సమాచారం అందడంతో రెయిడ్స్ నిర్వహించామని వివరించారు. దీంతో రూ.26 లక్షల విలువైన మందులు దొరికాయని తెలిపారు.

నగరంలోని దిల్ సుఖ్ నగర్ కు చెందిన పువ్వాడ లక్ష్మణ్, సైదాబాద్ కు చెందిన పోకల రమేశ్, గర్లపల్లి పూర్ణచందర్ లు మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నారు. శివగంగా థియేటర్ దగ్గర్లో పువ్వాడ లక్ష్మణ్ కు గోడౌన్ ఉంది. ఈ ముగ్గురూ కలిసి నగరంలోని వివిధ మెడికల్ షాపులకు మందులు సప్లై చేస్తున్నారు. ఉత్తరాఖండ్ కాశీపూర్ నుంచి నకిలీ మందులను కొరియర్ లో తెప్పించి, వాటికి సన్ ఫార్మా, గ్లిన్ మార్క్, అరిస్టో ఫార్మా, టొరెంటో ఫార్మా.. తదితర ప్రముఖ బాండ్ల లేబుళ్లను అతికిస్తున్నారు. ఆపై వాటిని మందుల దుకాణాలకు చేరుస్తున్నారు.

ఈ నకిలీ మందుల వ్యవహారంపై హనుమకొండ డ్రగ్ ఇన్ స్పెక్టర్ కు సమాచారం అందగా.. ఆయన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు తెలియజేశారు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ అంజుమ్‌‌‌‌ అబిదా ఆధ్వర్యంలో సౌత్‌‌‌‌ వెస్ట్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులు కొరియర్ కంపెనీలో తనిఖీ చేసి మందుల పార్సిల్స్ ను గుర్తించారు. వాటిపై ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ లోని నిందితుల ఇళ్లు, గోడౌన్లలో తనిఖీలు చేసి 26 లక్షల విలువైన నకిలీ ట్యాబ్లెట్స్‌‌‌‌ను సీజ్ చేశారు. ఈ దందా నడిపిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News