Uttam Kumar Reddy: మేడిగడ్డపై ఎన్నికలకు ముందు అధికారులు ఆ ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే విధంగా నివేదిక ఇచ్చారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నాటి అధికారులు ఇచ్చిన నివేదిక సరైనది కాదన్న ఉత్తమ్
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం దరఖాస్తు చేస్తామని బీఆర్ఎస్ చెప్పిందన్న మంత్రి
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy falts engineers over Medigadda issue

కాళేశ్వరం ప్రాజెక్టు... మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిన అంశానికి సంబంధించి ఎన్నికలకు ముందు అధికారులు... నాటి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే విధంగా నివేదిక ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు మేడిగడ్డలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై తాము చెప్పిన విషయాలు నిజమయ్యాయని అన్నారు. లక్షల కోట్ల అప్పులు... పదుల కోట్ల బిల్లులు బకాయిలు పడ్డారని విమర్శించారు. అసలు ఈ ప్రాజెక్టు కట్టిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం దరఖాస్తు చేస్తామని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని... కానీ ప్రొఫార్మా ప్రకారం దరఖాస్తును పంపించలేదని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకు రావడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామని తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని... తప్పు జరిగింది కాబట్టే ఇలా జరిగిందన్నారు. బ్యారేజీ స్టోరేజ్ గత ప్రభుత్వం చెప్పినంతగా లేదని అనుమానం వ్యక్తం చేశారు. డిజైన్, కాన్సెప్ట్ అన్నింటా ఫెయిల్ అయ్యారన్నారు. పిల్లర్ కుంగిపోయిన అంశంపై ఎన్నికలకు ముందు అధికారులు గత ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చారని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నాటి అధికారులు ఇచ్చిన నివేదిక సరైనది కాదని... ఇప్పుడు మేము అసలు నివేదిక ఇస్తామని వెల్లడించారు.

More Telugu News