Sachin Tendulkar: సౌతాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమికి సరైన కారణం చెప్పిన సచిన్ టెండూల్కర్

  • తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఓడిన భారత్
  • షాట్ల ఎంపిక ఆశించిన స్థాయిలో లేకపోవడమే ప్రధాన కారణమన్న సచిన్
  • సఫారీ జట్టుపై ప్రశంసలు
Sachin Tendulkar Pin Points Exact Reason Behind Indias Defeat

దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమైన టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌పై టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. సఫారీ జట్టుపై ప్రశంసలు కురిపించాడు.

దక్షిణాఫ్రికా బాగా ఆడిందని పేర్కొన్న సచిన్.. తొలి ఇన్నింగ్స్‌ తర్వాత సౌతాఫ్రికా కొంత నిరుత్సాహంతో ఉన్నట్టు తొలుత అనిపించిందని పేర్కొన్నాడు.  అయితే, భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వారి పేస్ దాడి అంచనాలను మించిపోయిందన్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినప్పటికీ సఫారీ పేసర్లు అద్భుత ప్రదర్శన చేసి జట్టును గెలిపించారని అన్నాడు.

భారత ఆటగాళ్ల షాట్ల ఎంపిక ఆశించిన స్థాయిలో లేదని, జట్టు ఓటమికి అదే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. టెస్టు మొత్తంలో ఎల్గర్, జాన్సన్, బెడింగ్‌హామ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే బ్యాట్‌తో మెరిశారని, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడారని తెలిపాడు. కాగా, ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

More Telugu News