Group 2 exam: మూడోసారి వాయిదాపడ్డ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్ష

  • తదుపరి తేదీలను ప్రకటిస్తామని వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు 
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, టీఎస్‌పీఎస్సీ బోర్డు చైర్మన్, సభ్యుల రాజీనామాల నేపథ్యంలో నిర్ణయం
  • వేర్వేరు కారణాలతో ఇదివరకే రెండుసార్లు వాయిదాపడ్డ పరీక్ష
Group 2 exam postponed for the third time by TSPSC

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటించింది. పరీక్ష నిర్వహించనున్న తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. దీంతో గ్రూప్-2 పరీక్ష మూడోసారి వాయిదాపడ్డట్టు అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, టీఎస్‌పీఎస్సీ బోర్డు చైర్మన్, సభ్యులు రాజీనామాల నేపథ్యంలో మూడోసారి గ్రూప్-2 వాయిదా పడింది. నిజానికి 29, 30 తేదీల్లోనే పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ పేపర్ లీకేజీ, ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కారణంగా నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్ష రెండోసారి వాయిదాపడిన విషయం తెలిసిందే. 

మార్చి రెండు లేదా మూడో వారంలో పది పరీక్షలు!
పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలను మార్చి నెల రెండు లేదా మూడవ వారంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం జరిగిన కీలక సమావేశంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులు చర్చించారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ దేవసేన, ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ కృష్ణారావు సంబంధిత శాఖల అధికారులతో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పలు అంశాలపై చర్చించారు.

More Telugu News