Team India: 24 పరుగులకే 3 వికెట్లు డౌన్... కష్టాల్లో టీమిండియా

  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్
Team India in troubles

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మొదటి సెషన్ లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ తడబాటుకు గురైంది. సెంచురియన్ లో ప్రారంభమైన ఈ టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా టాస్ గెలిచి టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. పిచ్ పై తేమ, పచ్చిక ఉండడంతో బ్యాటింగ్ కష్టసాధ్యంగా మారింది. 

సొంతగడ్డ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న సఫారీ సీమర్లు భారత టాపార్డర్ కు సమస్యలు సృష్టించారు. దాంతో టీమిండియా 24 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులు చేసి రబాడా బౌలింగ్ లో వెనుదిరిగాడు. 

ఆ తర్వాత ఒక్క పరుగు తేడాతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (17), శుభ్ మాన్ గిల్ (2) వెనుదిరిగారు. ఈ రెండు వికెట్లు కొత్త బౌలర్ నాండ్రే బర్గర్ ఖాతాలో చేరాయి. ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై నిప్పులు చెరిగాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 19 ఓవర్లలో 3 వికెట్లకు 55 పరుగులు. విరాట్ కోహ్లీ 17, శ్రేయాస్ అయ్యర్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

More Telugu News