AP Govt jobs: దేవాదాయ శాఖలో 70 పోస్టులు.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఏపీ సర్కారు

  • ఇంజనీర్ పోస్టుల భర్తీకి దేవాదాయ శాఖ ఏర్పాట్లు
  • డిసెంబర్ 30 తో ముగియనున్న దరఖాస్తు గడువు
  • బీఈ, బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు
Andhra Pradesh Endowments Department Released A Notification For Filling Up 70 Engineering Posts

దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్న ఈ పోస్టులలో 35 ఏఈఈ (సివిల్‌), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్‌), మరో 30 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి దేవాదాయ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 30వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ‘ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజి ఆఫ్‌ ఇండియా’ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరగనుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరి రిజర్వేషన్‌ ఆధారంగా రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం వంద మార్కులకు నిర్వహించే ఈ రాత పరీక్షలో ఇంజనీరింగ్ అంశాలపై ప్రశ్నలకు 80 మార్కులు, ఇంగ్లిష్ ప్రావీణ్యంపై ప్రశ్నలకు 10 మార్కులు, జనరల్ నాలెడ్జికి 10 మార్కులు ఉంటాయని నోటిఫికేషన్ లో వివరించారు. కాగా, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 120 కొత్త ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఇంజనీరింగ్‌ సిబ్బందిని నియమిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

More Telugu News