Vijayashanti: బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ నేత విజయశాంతి పంచ్‌లు!

  • బీఆర్ఎస్‌కు తెలంగాణలో‌ లోక్‌సభ ఎన్నికలు చిన్నవని ఎద్దేవా
  • లోక్‌సభ ఎన్నికల్లో పొరుగు రాష్ట్రాల్లో 50 సీట్లతో కేంద్రంలో చక్రం తిప్పొచ్చని వ్యాఖ్య
  • భవిష్యత్ రహిత సమితి తెలంగాణలో మూడు సీట్లు గెలుస్తుందని జోస్యం
Congress leader Vijayashanthi lashes out at BRS

కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పొరుగు రాష్ట్రాల వారు తన నాయకత్వం కోరుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ సెటైర్లు పేల్చారు. బీఆర్‌ఎస్‌ను భవిష్యత్ రహిత సమితిగా తెలంగాణ ప్రజలు నిర్ణయించారని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పొరుగు రాష్ట్రాల్లో 50 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పొచ్చంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌ నిర్దేశించుకున్న పెద్ద కార్యాచరణ ముందు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు చిన్నవని వ్యాఖ్యానించారు. 

‘‘బీఆర్ఎస్‌ కు ప్రస్తుతమున్న అతి పెద్ద కార్యాచరణ ముందు తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు చాలా చిన్నవి. ప్రకటించుకున్న జాతీయ పార్టీగా ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లల్ల లక్షలాది ప్రజలు వారి నాయకత్వం కోరుకుంటున్నారని గతంలో ఎన్నోమార్లు తెలంగాణ ప్రజల ముందు ప్రగల్భాలు ఘనంగా చెప్పుకున్న సంఘటనల దృష్ట్యా ఆయా రాష్ట్రాలల్ల అత్యవసరంగా పనిచేసి "భవిష్యత్ రహిత సమితి" అని తెలంగాణ సమాజం నిర్ణయించిన బీఆర్ఎస్‌కు అనేక ఎంపీలు వారు గెలిపించి తీరుతారు బహుశా..

అంతెందుకు, తెలంగాణల సుమారు 14 స్థానాలు అమ్మ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గారు, శ్రీమతి ప్రియాంక గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంల నేతలు, కార్యకర్తల పోరాటంతో కాంగ్రెస్ గెలిచి, ఒక మూడు స్థానాలు ఎట్లనో ఒకవేళ బీఆర్ఎస్‌ వస్తే, మిగతా పై రాష్ట్రాలల్ల సుమారు 50 స్థానాలు గెలిచి, కేసీఆర్ గారు కేంద్రంల కారు చక్రం తిప్పచ్చు’’ అంటూ విజయశాంతి ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.

More Telugu News