Houthi Terrorists: సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తాం: హౌతీ ఉగ్రవాదులు

  • పాలస్తీనాకు మద్దతుగా ఎర్రసముద్రంలో దాడులకు దిగుతున్న హౌతీ ఉగ్రవాదులు
  • సముద్రంలో నెట్‌ కేబుల్స్ కట్ చేసి ప్రపంచాన్ని రాతియుగంలోకి నెడతామంటూ తాజా వార్నింగ్
  • ఎర్రసముద్రంలో అమెరికా, మిత్రదేశాల బలగాల మోహరింపునకు ప్రతిగా హెచ్చరికల జారీ
  • భారత్‌కు పలు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయంటున్న నిపుణులు
Houthi warning over cutting submarine internet cables

పాలస్తీనాపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలను ఇరాన్‌లోని హౌతీ ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకాలు సృష్టించే దిశగా హౌతీలు ఎర్రసముద్రంలో సరుకు రవాణా నౌకలపై డ్రోన్ దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో హౌతీలు తాజాగా మరో హెచ్చరిక చేశారు. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థపై దాడి చేస్తామని ప్రకటించారు. బాబ్ అల్-మందబ్ జలసంధి మీదుగా సముద్ర భూగర్భం నుంచి వెళుతున్న ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఫలితంగా, ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని హెచ్చరించారు. ఎర్రసముద్రంలో బలగాలు మోహరించాలన్న అమెరికా నిర్ణయానికి ఇటలీ, స్పెయిన్, మద్దతిస్తాయనే వార్తలతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రపంచాన్ని రాతి యుగంలోకి నెట్టేస్తామన్నారు. 

కాగా, హౌతీ హెచ్చరికలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హౌతీలను కట్టడి చేయకపోతే ప్రపంచానికి నెట్వర్క్ సమస్య ఏర్పడుతుందని అరబ్, అంతర్జాతీయ మీడియా హెచ్చరించింది. 

కాగా, హౌతీల చర్యలతో భారత్‌కు ప్రమాదమేమీ లేదని భారత టెలీకమ్యూనికేషన్ శాఖ విజిలెన్స్ విభాగం మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జార్జి మార్షల్ పేర్కొన్నారు. ‘‘భారత్‌పై ఈ చర్యల ప్రభావం ఉండదు. సముద్ర గర్భంలో ఒకే లైన్‌లో ఇంటర్నెట్ ఫైబర్ కేబుల్ వ్యవస్థ లేదు. దేశాల మధ్య వేర్వేరు సంస్థలకు చెందిన కేబుళ్లు ఉన్నాయి. భారత్‌కు చెన్నై, పుదుచ్చేరి, కోల్‌కతా, ముంబై వంటి పోర్టుల వద్ద అంతర్జాతీయ ఇంటర్నెట్ హబ్‌లు ఉన్నాయి. ముంబై-హైదరాబాద్ లైన్‌లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే..సర్వీస్ ప్రొవైడర్లు వెంటనే చెన్నై లేదా కోల్‌కతా హబ్ నుంచి డేటాను యాక్సెస్ చేస్తారు. అర్జెంటీనా వంటి పలు దేశాల నుంచి మన హబ్‌లకు అత్యవసర ఇంటర్నెట్ కనెక్టివిటీ అవకాశాలు ఉన్నాయి’’ అని తెలిపారు.

More Telugu News