Tahsildar suspended: లంచాలు తీసుకోక తప్పదన్న తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

  • శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటన
  • రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన వీఆర్వోను సమర్ధించిన మడకశిర తహసీల్దార్
  • ప్రజలిచ్చే లంచాలతోనే అధికారిక పర్యటనకు ఏర్పాట్లు చేస్తామంటూ వ్యాఖ్య
Tahsildar suspended in Srisathyasai district for supporting vro asking for bribe

లంచం తీసుకోవడాన్ని సమర్థించుకున్న ఓ తహసీల్దారుపై తాజాగా ఉన్నతాధికారులు వేటు వేశారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దారు ఇటీవల లంచం తీసుకోవడం సబబేనంటూ ఓ రైతుతో వాదించిన వీడియో సంచలనంగా మారింది. వీఆర్వో లంచం కోసం పీడిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతుతో తహసీల్దార్ ముర్షావలీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఏ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఉన్నా అంతే.. 2 నెలల కిందట నేను వచ్చిన కొత్తలో ఓ మంత్రి ఇక్కడకు వస్తే నలుగురు వీఆర్వోలు రూ.1.75 లక్షలు ఖర్చుచేశారు. ఒక్క రూపాయీ రాలేదు. ఇటీవల రాష్ట్రస్థాయి మహిళా అధికారి ఒకరు వచ్చారు. ఆ అమ్మ ఒక టెర్రరట. బెడ్‌రూంలోకి ఈగ కూడా రాకూడదట. ఆమె తినడానికి భారీ మెనూ ఇచ్చారు. దానిని చూస్తే భయపడిపోతారు. అవి మడకశిరలో దొరకవు. హిందూపురం నుంచి తెప్పించాలి. పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతుంది. ఈ మెనూ ఖర్చు తహసీల్దారు భరిస్తాడా? అంతా వీఆర్వోలతోనే తెప్పిస్తాం. వీటికి మీ దగ్గర తీసుకున్న డబ్బే ఇస్తాం. లేకపోతే మా జీతాల్లోంచి ఖర్చు చేయాలా? అని ప్రశ్నించారు. ఒంటిపై ఉన్న కొన్ని పుళ్లను డాక్టర్‌కు మాత్రమే చూపించుకోగలమని కూడా చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News