రూ.500లకే గ్యాస్‌ బండ స్కీమ్‌కు లబ్దిదారుల ఎంపికపై తెలంగాణ సర్కారు కసరత్తు!

ఎన్నికల హామీలను అమలు చేయడంపై తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయగా తాజాగా రూ.500లకే గ్యాస్ పంపిణీపై కసరత్తు మొదలుపెట్టింది. లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియపై విధివిధానాలను రూపొందిస్తోంది. రేషన్‌ కార్డు ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పౌరసరఫరాల శాఖ కీలక ప్రాతిపదనలు పంపించినట్టు సమాచారం. పంపిణీలో అవకతవకలు జరగకుండా లబ్దిదారుల బయోమెట్రిక్‌‌ను తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలో కలెక్టర్లతో ఆదివారం నిర్వహించనున్న సమీక్షలో ఈ అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి.

రాష్ట్రంలో కొత్తగా గ్యాస్‌ కనెక్షన్లు తీసుకునేవారిని పరిగణనలోకి తీసుకోకూడదని, కొత్తగా రేషన్ పొందే వారిని గ్యాస్ పథకానికి ఎంపిక చేయవచ్చని పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరోవైపు, రాయితీ సిలిండర్లను ఏడాదికి ఆరు ఇవ్వాలా? లేక పన్నెండు ఇవ్వాలా? అనే విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఏయే అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలనే విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుదారుల సంఖ్య 89.98 లక్షలు ఉండగా గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 1.20 కోట్లుగా ఉంది.  రేషన్ కార్డ్ డేటాబేస్‌తో మ్యాపింగ్‌ అయిన గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలుగా ఉంది.

Telangana government
Gas for Rs500
Gas cylinder
Congress
Telangana

More Telugu News