Bhajrang Punia: మళ్లీ తెరపైకి రెజ్లింగ్ వివాదం... 'పద్మశ్రీ' వెనక్కి ఇచ్చేసిన భజరంగ్ పునియా

  • భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక
  • గత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు సంజయ్ సింగ్ అత్యంత సన్నిహితుడు
  • రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలు
  • అందుకే సంజయ్ సింగ్ ఎన్నికను వ్యతిరేకిస్తున్న రెజ్లర్లు
  • ఇప్పటికే రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సాక్షి మాలిక్
  • పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించిన భజరంగ్ పునియా
Wrestler Bhajrang Punia returned his Padmashree award

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సంజయ్ సింగ్ ఎన్నికైనట్టు ప్రకటన వెలువడగానే, భారత రెజ్లింగ్ రంగంలో తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. ప్రముఖ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ తాను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. మీడియా సమావేశంలో టేబుల్ పై బూట్లను ఉంచి తన ఉద్దేశాన్ని వెల్లడించింది. తాజాగా, మరో రెజ్లర్ భజరంగ్ పునియా కూడా తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నానంటూ ప్రధాని మోదీకి లేఖ రాశాడు. 

కాగా, సంజయ్ సింగ్ ఎన్నిక రెజ్లర్లను సంచలన నిర్ణయాల దిశగా నడిపించడానికి బలమైన కారణమే ఉంది. భారత రెజ్లింగ్ సమాఖ్య గత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రెజ్లర్ల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు రోజుల తరబడి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇప్పుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్... బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు అత్యంత సన్నిహితుడు. ఈ కారణంగానే భారత రెజ్లర్లు అతడి ఎన్నికను హర్షించలేకపోతున్నారు. వరుసగా, కీలక నిర్ణయాలను ప్రకటిస్తున్నారు.

More Telugu News