Bacteria: మేలు చేసే బ్యాక్టీరియాకు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు

  • ఝరియా బొగ్గు గనుల మట్టిలో కొత్త బ్యాక్టీరియా ఆవిష్కరణ
  • పరిశోధనలో పాలుపంచుకున్న విశ్వభారతి యూనివర్సిటీ నిపుణులు
  • బ్యాక్టీరియాకు 'ప్లాంటోయా ఠాగూరై' అని నామకరణం 
Good bacteria named after Rabindranath Tagore

కోల్ కతాలోని విశ్వభారతి యూనివర్సిటీకి చెందిన ఆరుగురు పరిశోధకుల బృందం కొత్త రకం బ్యాక్టీరియాను కనుగొంది. ఈ బ్యాక్టీరియాలో మొక్కలు వేగంగా ఎదిగేందుకు ఉపయోగపడే పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. ఇది వృక్ష జాతులకు ఎంతో మేలు చేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మంచి బ్యాక్టీరియాకు నోబెల్ విజేత, 'విశ్వకవి' రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా 'ప్లాంటోయా ఠాగూరై' అని నామకరణం చేశారు. 

ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మైక్రోబయాలజీ ప్రొఫెసర్ బొంబా దామ్ మాట్లాడుతూ, రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యవసాయాన్ని ఎంతగానో ఇష్టపడేవారని, వ్యవసాయం గొప్పగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారని వెల్లడించారు. అందుకే ఈ మేలు చేసే బ్యాక్టీరియాకు రవీంద్రుడి పేరు పెట్టామని వివరించారు. జీవులకు ఆయన పేరు పెట్టడం ఇదే ప్రథమం అని తెలిపారు. 

"వ్యవసాయంలో విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. దాంతో రైతులు సేంద్రియ సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. సేంద్రియ ఎరువుల వాడకం పెరుగుతోంది. మేం తాజా బ్యాక్టీరియాను ఝరియో బొగ్గు గనుల నుంచి సేకరించిన మట్టిలో కనుగొన్నాం. ఈ మంచి బ్యాక్టీరియా సూక్ష్మపోషకాలైన పొటాషియం, ఫాస్ఫరస్ ద్రావణీయతను భూమిలో పెంపొందిస్తుంది. అంతేకాదు, నైట్రోజన్ ను మట్టిలో పునర్ స్థిరీకరిస్తుంది. అంతేకాదు, మొక్కల పెరుగుదులకు తోడ్పడే అనేక పదార్థాలను ఈ బ్యాక్టీరియా కలిగి ఉంది. మా పరిశోధనలో తేలింది ఏంటంటే... దీన్ని గతంలో ఎవరూ గుర్తించలేదు... ఇది కొత్త బ్యాక్టీరియా" అని బొంబా ధామ్ వివరించారు.

More Telugu News