Telangana: పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్... ఏ వాహనానికి ఎంత తగ్గింపు అంటే..!

  • ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల‌పై 90 శాతం, టూ వీల‌ర్స్‌పై 80 శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం
  • ఆటోలు, ఫోర్ వీల‌ర్‌పై 60 శాతం, భారీ వాహ‌నాల‌పై 50 శాతం తగ్గింపు ప్రకటన
  • ఈ నెల 26వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుందన్న ప్రభుత్వం
TS government discount on pending challans from Dec 26

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ చలాన్లపై భారీగా డిస్కౌంట్‌ను ప్రకటించింది. 2  కోట్ల‌కు పైగా పెండింగ్ చ‌లాన్లు ఉండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం రాయితీ క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల‌పై 90 శాతం రాయితీ; టూ వీల‌ర్స్‌పై 80 శాతం; ఆటోలు, ఫోర్ వీల‌ర్‌పై 60 శాతం; భారీ వాహ‌నాల‌పై 50 శాతం రాయితీ లేదా తగ్గింపును ఇచ్చినట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నెల 26వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు వాహ‌న‌దారులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవడానికి గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకు వసూలు అయ్యాయి. దాదాపు 65 శాతం చలాన్లు చెల్లించారు. అయితే ఆ తర్వాత మళ్లీ పెండింగ్ చలాన్లు పెరిగిపోతున్నాయి. గత నెలాఖరున చలాన్ల సంఖ్య మళ్లీ 2 కోట్లను దాటింది. దీంతో ప్రభుత్వం మరోసారి రాయితీని ప్రకటించింది.

More Telugu News