gas cylinder: రూ.500కే వంట గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు: ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్

  • వెల్లడించిన గ్రేటర్ హైదరాబాద్ ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
  • రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలు రూపొందించలేదన్న అశోక్ కుమార్
  • నవంబర్ నుంచే కేవైసీ పరిశీలన జరుగుతున్నట్లు వెల్లడి
LPG Dealers association on RS 500 gas cylinder

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ ఒకటి. ఈ పథకం పొందడానికి కేవైసీ తప్పనిసరి అని చెప్పడంతో వినియోగదారులు ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు వరుస కడుతున్నారు. అయితే తెలంగాణలో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని గ్రేటర్ హైదరాబాద్ ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ... ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలను రూపొందించలేదన్నారు.

కేవైసీ అప్ డేట్ చేసిన వారికి మాత్రమే రూ.500కు ఉచిత గ్యాస్ సిలిండర్ వస్తుందని జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదన్నారు. అది అపోహ మాత్రమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు నవంబర్ నుంచే రాష్ట్రంలో కేవైసీ పరిశీలన జరుగుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అనడంతో వినియోగదారులు కేవైసీ గురించి ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. అందుకే వారు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారన్నారు.

More Telugu News