సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత!
- ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించుకోవచ్చన్న హైకోర్టు
- ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు
- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డ ఎన్నికలు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో, డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని అప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలన్నీ ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నాయి.
అయితే, ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని కోరుతూ ప్రస్తుత ప్రభుత్వం పిటిషన్ వేయడంతో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి సమయం పడుతుందని, అధికారులు బిజీగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకం కాదని అభిప్రాయపడ్డ హైకోర్టు... ఈ నెల 27న యథావిధిగా ఎన్నికలను నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.