Varla Ramaiah: పవన్ కల్యాణ్ సవ్యసాచి అయితే... నాదెండ్ల మనోహర్ శ్రీకృష్ణుడు: వర్ల రామయ్య

  • పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభ
  • రాష్ట్రంలోని దళితులందరూ జగన్ ను ఛీకొట్టాలని రామయ్య పిలుపు  
  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించాలంటూ దళితులకు విజ్ఞప్తి 
Varla Ramaiah speech in Yuvagalam meeting at Polipalli

యువగళం నవశకం సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రసంగించారు. వేదికపై ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి... పవన్ కల్యాణ్ గారు సవ్యసాచి (అర్జునుడు) అని అభివర్ణించారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో జనసేన పార్టీ రథంపై సవ్యసాచిలా పవన్ కల్యాణ్ గారు రెండు చేతులతో బాణాలు వేస్తూ ఈ అవినీతి జగన్ పరిపాలనను త్యజించండి అంటూ కోరుతూ ఉంటే... ఆ రథానికి సారథిలా శ్రీకృష్ణుడిలా నాదెండ్ల మనోహర్ పాంచజన్యం పూరించాలని వర్ల రామయ్య పేర్కొన్నారు. 

అంతకుముందు ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని దళితులందరూ జగన్ ను ఛీకొట్టాలని పిలుపునిచ్చారు. "ఈ సభలో లక్ష మంది వరకు దళితులు ఉంటారు, రాష్ట్రంలో కోటి మంది వరకు దళితులు ఉంటారు. ఆ దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ బిడ్డగా, మీ రక్తం పంచుకుని పుట్టినవాడిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జగన్ మోహన్ రెడ్డి మోసకారి. ఈ ముఖ్యమంత్రి దళిత ద్రోహి, ఈ ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకి. 

ఎన్నికల ముందు మనల్ని అందరినీ భ్రమల్లో ఉంచుతున్నాడు. మీ పిల్లల మేనమామని అంటూ మోసపుచ్చుతున్నాడు. అసత్య వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి, మనల్ని ఇనుప పాదాల కింద అణగదొక్కుతున్న జగన్ ను దళితులంతా వదిలేయాలి. దళితుల కోసం 29 పథకాలు తీసుకువచ్చి మన అభ్యున్నతిని ఆకాంక్షించే నాయకుడు చంద్రబాబును గెలిపించుకుందాం" అంటూ వర్ల రామయ్య పిలుపునిచ్చారు.

More Telugu News