Revanth Reddy: తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం: రేవంత్ రెడ్డి

  • ఢిల్లీలో గౌరవ్ ఉప్పల్, ఓఎస్డీ సంజయ్ జూజులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
  • తెలంగాణ భవన్ విస్తీర్ణం.. భవనాల పరిస్థితిపై ఆరా
  • భవన్ శిథిలావస్థకు చేరుకుందని చెప్పడంతో కొత్తది నిర్మించుకుందామన్న సీఎం
CM Revanth Reddy on Delhi Telangana Bhavan

తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జూజుతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత? ఇందులో ఎన్ని భవనాలు ఉన్నాయి? వాటి స్థితి... తెలంగాణ వాటా తదితర అంశాలు అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు.

రెండు రాష్ట్రాలకు సంబంధించి 19.78 ఎకరాల భూమి ఉందని, ఇందులో 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రహదారులు, గోదావరి బ్లాక్ ఉండగా... 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టళ్లు, 7.641 ఎకరాల్లో పటౌడీ హౌస్ ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తెలంగాణ వాటాకు ఎంత వస్తుందని ముఖ్యమంత్రి ప్రశ్నించగా... పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 8.245 ఎకరాలు, ఏపీకి 11.536 ఎకరాలు వెళతాయని అధికారులు వివరించారు. అలాగే ప్రస్తుత స్థితి, సిబ్బంది నివాస గృహాల స్థితి తదితర అంశాలపై సీఎం ఆరా తీశారు.

ఈ భవనాలు నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవని.. శిథిలావస్థకు చేరుకున్నాయని మరమ్మతులు చేయిస్తున్నట్లు రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త భవనం నిర్మించుకుందామన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్ మ్యాప్‌ను పరిశీలించారు.

More Telugu News