Ponguleti Srinivas Reddy: ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • ఎవరైతే ప్రజాధనం దోపిడీ చేశారో.. ప్రభుత్వ భూములు ఆక్రమించారో.. వాటిపై సమీక్షలు చేస్తామని హామీ
  • గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిద్దిద్దాలని సూచన
  • ఇది కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రెండ్లీ ప్రభుత్వమని వ్యాఖ్య
Minister Ponguleti Srinivas Reddy to employees

ఉద్యోగులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఎవరైతే ప్రజాధనం దోపిడీ చేశారో.. ప్రభుత్వ భూములు ఆక్రమించారో.. వాటన్నిటిపై సమీక్షలు చేస్తామని... సరిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలందాలని అధికారులను కోరినట్లు తెలిపారు. అధికారులను వేధించటానికి సమీక్ష చేయలేదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేసే అధికారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆరు గ్యారంటీల అమలు లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని వ్యాఖ్యానించారు.

ఉద్యోగులపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ నేతలు రంకెలేస్తున్నారని, ఇంకా అధికారంలోనే ఉన్నామని కలలు కంటున్నారని విమర్శలు గుప్పించారు. 'ప్రతిపక్ష పార్టీ నేతలకు చెబుతున్నా.. మీలా మేం మాయమాటలు చెప్పం.. మీలా ప్రజలను మోసం చేయం.. ధనిక రాష్ట్రం తెలంగాణను కొల్లగొట్టింది.. ఖజానా ఖాళీ చేసింది.. మీరే' అని మంత్రి మండిపడ్డారు.

ఇది ఇందిరమ్మ రాజ్యమని... ప్రజారాజ్యమని, జర్నలిస్టులకూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సామాన్య ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించబోతున్నామని, ధరణి పేరుతో జరిగిన దోపిడీని బట్టబయలు చేసి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.

More Telugu News