Nagababu: రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు అంశంపై స్పందించిన నాగబాబు

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన ఆత్మీయ సమావేశాలు
  • హాజరైన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు
  • హైదరాబాదులో ఉన్న ఓటును క్యాన్సిల్ చేసుకున్నానని వెల్లడి
  • మంగళగిరిలో ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే అడ్డుపడుతున్నారని ఆగ్రహం
Nagababu reacts criticism on vote

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలు ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. నెల్లూరు సిటీ, సూళ్లూరుపేట, కోవూరు నియోజకవర్గాల జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓటు ఉండగా, ఏపీలో ఎలా ఓటుకు దరఖాస్తు చేసుకుంటారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. 

"ఏపీకి ఓటు మార్చుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాదులో ఉన్న ఓటును క్యాన్సిల్ చేసుకున్నాను. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నేను, నా కుటుంబం ఓటు వేయలేదు. మంగళగిరిలో ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే, ఓటు హక్కు రాకుండా బూత్ లెవల్ స్థాయిలో కూడా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారు. నా ఓటును జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థికి వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఏ నాయకుడు కూడా ప్రతిపక్షం ఉండకూడదని కోరుకోడు. అలా కోరుకున్నాడూ అంటే వాడు నియంతే అవుతాడు. మేం మాత్రం వైసీపీ 25 సీట్లతో ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నాం" అని నాగబాబు వివరించారు.

More Telugu News