Team India: పోటాపోటీగా వికెట్లు తీసిన అర్షదీప్, అవేష్ ఖాన్... 116 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా

  • జొహాన్నెస్ బర్గ్ లో తొలి వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • బౌలింగ్ కు అనుకూలించిన పిచ్
  • నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు
  • అర్షదీప్ కు 5, అవేష్ ఖాన్ కు 4 వికెట్లు
Team India bundled out South Africa for 116 runs

దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా పేసర్లు అద్భుతంగా రాణించారు. అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్ నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికాను కుప్పకూల్చారు. జొహాన్నెస్ బర్గ్ లో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. 

సఫారీ లైనప్ ను హడలెత్తించిన ఎడమచేతివాటం పేసర్ అర్షదీప్ సింగ్ 5 వికెట్లు తీయడం హైలైట్. మరో ఎండ్ లో అవేష్ ఖాన్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు 1 వికెట్ దక్కింది. పిచ్ పై స్వింగ్, బౌన్స్ లభించడంతో భారత పేసర్లు పండగ చేసుకున్నారు. 

చివర్లో ఆండిలే ఫెహ్లుక్వాయో పోరాడడంతో దక్షిణాఫ్రికా స్కోరు 100 దాటింది. ఫెహ్లుక్వాయో 3 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేశాడు. జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు అతడిదే. 

ఓపెనర్ టోనీ డి జోర్జి 28, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ 12, తబ్రైజ్ షంసీ 11 (నాటౌట్) పరుగులు చేశారు. రీజా హెండ్రిక్స్ (0), వాన్ డర్ డుసెన్ (0), హెన్రిచ్ క్లాసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), వియాన్ ముల్డర్ (0) ఘోరంగా విఫలమయ్యారు.

More Telugu News