gang rape: కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్.. రాజస్థాన్‌లో దారుణ ఘటన

  • క్యాబిన్‌లో కూర్చున్న బాలికపై వంతుల వారీగా అత్యాచారం చేసిన ఇద్దరు డ్రైవర్లు
  • బస్సులోని ప్రయాణికులు అనుమానంతో డోర్ తెరవడంతో బయటపడ్డ దారుణం
  • డ్రైవర్లను చితక బాదిన ప్రయాణికులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
gang rape on a girl in a moving bus A terrible incident in Rajasthan

2012 నాటి ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరహాలో రాజస్థాన్‌లో మరో దారుణం వెలుగుచూసింది. కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం జరిగింది. డిసెంబర్ 9న కాన్పూర్ నుంచి జైపూర్ వెళుతున్న బస్సులో ఓ బాలికపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని బస్సీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఫూల్‌చంద్ మీనా మీడియాకు వెల్లడించారు. జైపూర్‌లోని తన మామయ్య ఇంటికి వెళ్లేందుకు డిసెంబర్ 9న రాత్రి 7:30 గంటల సమయంలో బాలిక బస్సు ఎక్కింది. సీటు దొరక్కపోవడంతో బస్సు క్యాబిన్‌లో కూర్చుంది. క్యాబిన్‌లో కూర్చున్న కొందరు ప్రయాణికులు తమ గమ్యస్థానాల్లో దిగిపోయాక డ్రైవర్లు ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వంతులవారీగా ఆమెపై అత్యాచారం చేశారని ఫూల్‌చంద్ మీనా వివరించారు.

ఏదో అనుమానాస్పదంగా అనిపించడంతో బస్సులోని కొందరు ప్రయాణికులు క్యాబిన్ డోర్ తెరవడంతో ఈ అఘాయిత్యం బయటపడింది. బాలిక దీన స్థితిలో ఉండడాన్ని గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారని మీనా వెల్లడించారు. అయితే ఒక డ్రైవర్ పారిపోగా మరో వ్యక్తిని పట్టుకున్నారని చెప్పారు. ప్రయాణికులు బస్సును ఒక పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్లి ఆపారని, బాలికను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. బాలిక మామయ్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా కోరారని ఫూల్‌చంద్ మీనా పేర్కొన్నారు. అక్కడికి చేరుకున్న బాలిక మావయ్య అత్యాచారంపై ఫిర్యాదు చేశాడని వివరించారు.

కాగా నిందిత బస్సు డ్రైవర్లలో మహ్మద్ ఆరిఫ్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మరో నిందితుడిని లలిత్‌గా గుర్తించామని, అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఈ అత్యాచార ఘటన 2012లో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనను గుర్తుకు తెచ్చింది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరగగా చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందిన విషయం తెలిసిందే.

More Telugu News