Nara Lokesh: ​టీడీపీలోకి వలసలు... పార్టీ కండువా కప్పిన నారా లోకేశ్

  • అనకాపల్లి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • 3,100 కి.మీ మైలురాయి చేరుకున్న పాదయాత్ర
  • శిలాఫలకం ఆవిష్కరించిన లోకేశ్
Nara Lokesh Yuvagalam Padayatra in Anakapalli

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనకాపల్లి పట్టణం గౌరీ గ్రంథాలయం వద్ద 3100 కి.మీ.ల మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక చోడవరం-అనకాపల్లి మధ్య రైల్వే బ్రిడ్జిని పూర్తిచేస్తామని హామీ ఇస్తూ లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

224వ రోజు యువగళం పాదయాత్ర యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం తిమ్మరాజుపేట క్యాంప్ సైట్ నుంచి అభిమానుల జననీరాజనాల నడుమ ప్రారంభమైంది. అనకాపల్లి శివార్లలో లోకేశ్ కు ఘనస్వాగతం లభించింది. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు బుద్దా నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, జనసేన ఇన్ చార్జి పర్చూరి భాస్కర్ రావు స్వాగతం పలికారు. 

కాగా, అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు నేడు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. జీవీఎంసీ 82వ వార్డులో యువగళం క్యాంప్ సైట్ లో సర్పంచ్ చంద్రశేఖర్, అక్కిరెడ్డి వెంకటరమణ, పాడేరు నియోజకవర్గం లగిసపల్లికి సర్పంచ్ పార్వతమ్మ, గొలగం ఎంపీటీసీ టీడీపీలో చేరారు. 

వీరితో పాటు అనకాపల్లికి చెందిన పలువురు వార్డు మెంబర్లు, మిల్క్ సొసైటీ సభ్యులు కూడా టీడీపీలో చేరారు. వీరందరికీ నారా లోకేశ్ టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, సర్పంచులను ఉత్సవ విగ్రహంలా ప్రభుత్వం మార్చిందని సర్పంచులు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. 

అనంతరం లోకేశ్  మాట్లాడుతూ...పంచాయతీలకు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని, పంచాయతీల నిధులు గ్రామాభివృద్ధికే ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికే రూ.వెయ్యికోట్లకు పైగా పంచాయతీల ఖాతాల నుండి విద్యుత్ బకాయిల పేరుతో లాక్కున్న జగన్ రెడ్డి ప్రభుత్వం...ఖాతాల్లో ఉన్న మరో రూ.250 కోట్లు కూడా లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మీ నియోజకవర్గాల్లో టీడీపీని అధికమెజారిటీతో గెలిపించాలి అని పార్టీలోకి వచ్చిన నేతలను లోకేశ్ కోరారు.

అంగన్ వాడీల శిబిరాన్ని సందర్శించిన లోకేశ్ 

యలమంచిలి నియోజకవర్గం మునగపాకలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీల శిబిరాన్ని లోకేశ్ సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ మరో 3 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ సమస్యలకు పరిష్కారం చూపకపోగా, బెదిరింపుల ధోరణిలో మాట్లాడడం జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం అని విమర్శించారు. 

అంగన్వాడీ సెంటర్లను తెరవకపోతే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో నడిపించుకుంటామని మంత్రులు వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల సమయంలో జగన్మహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడని ఆరోపించారు. 

టీడీపీ పాలనలో రెండు సార్లు అంగన్వాడీల గౌరవవేతనాన్ని పెంచామని, అంగన్వాడీలు న్యాయబద్ధమైన పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

లోకేశ్ ను కలిసిన ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు

అనకాపల్లి నెహ్రూచౌక్ వద్ద ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నారా లోకేశ్ స్పందిస్తూ... విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి అవగాహనా లేమి ప్రైవేటు టీచర్లకు శాపంగా పరిణమించిందని అన్నారు. 

కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లకు ఎటువంటి సాయం అందించకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రైవేట్ టీచర్లకు ఐడీ కార్డులు, ఆరోగ్య బీమా, పీఎఫ్, ఈఎస్ఐ , ప్రైవేటు మహిళా టీచర్లకు ప్రసూతి సమయంలో వేతనంతో కూడిన సెలవులు వంటి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. 

ప్రైవేటు స్కూల్స్ లో పనిచేసే సిబ్బంది పిల్లలకు ఆ సంస్థల్లో రాయితీతో విద్యనందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

లోకేశ్ ను కలిసిన కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు

అనకాపల్లి వేల్పుల వీధిలో కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో కాపు సామాజికవర్గానికి చంద్రబాబు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మాకు 5శాతం రిజర్వేషన్ ను అమలుచేసే అవకాశమున్నా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని ప్రశ్నించినా ఉపయోగం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

"మా పిల్లలు రిజర్వేషన్ అమలు కాకపోవడంతో విద్య, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. గతంలో అనకాపల్లిలో కాపు సంక్షేమ భవనానికి స్థలం ఇచ్చి భవన నిర్మాణానికి నిధులు కూడా కేటాయించారు. వైసీపీ వచ్చాక ఆ భవన నిర్మాణాన్ని నిర్వీర్యం చేసి మమ్మల్ని అవమానించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మాకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి, కాపు సంక్షేమ భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలి" అని నారా లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు.

నారా లోకేష్ స్పందిస్తూ...

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి కాపుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని, కాపు కార్పొరేషన్ కు రూ.3 వేల కోట్ల నిధులు కేటాయిస్తానని చెప్పి మోసగించారని వెల్లడించారు. 

"రాష్ట్రవ్యాప్తంగా నిమ్మకాయల చినరాజప్ప లాంటి కాపు ప్రముఖులపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై రాబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, అసంపూర్తిగా నిలచిపోయిన కాపు భవనాలను పూర్తిచేస్తాం. కాపు విద్యార్థులకు గతంలో మాదిరిగా విదేశీ విద్య పథకాన్ని అమలు చేస్తాం" అని వివరించారు. 

====

* యువగళం పాదయాత్ర వివరాలు*

*ఈరోజు నడిచిన దూరం 13.7 కి.మీ.*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 3101.4 కి.మీ.*

*225వరోజు (17-12-2023) యువగళం వివరాలు*

*పెందుర్తి/గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలు*

ఉదయం

8.00 – తోటాడ స్మార్ట్ సిటీ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.15 – తోటాడ హనుమాన్ టెంపుల్ వద్ద స్థానికులతో సమావేశం.

8.30 – తోటాడ జంక్షన్ లో బిసిలతో సమావేశం.

8.45 – సిరసపల్లిలో స్థానికులతో సమావేశం.

9.45 – వెంకటాపురం సెంటర్ లో స్థానికులతో సమావేశం.

10.45 – పాదయాత్ర పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

10.55 – భరణికం గ్రామంలో స్థానికులతో సమావేశం.

11.25 – పరవాడ సంతబయలు వద్ద భోజన విరామం.

మధ్యాహ్నం

2.00 – పరవాడ సంతబయలు వద్ద పంచగ్రామాల ప్రజలతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – పరవాడ సంతబయలు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.15 – పరవాడ సంతబయలులో ఆక్వారైతులతో సమావేశం.

4.25 – పరవాడ రామాలయం వీధి వద్ద స్థానికులతో సమావేశం.

4.40 – పరవాడ చిన్నా స్కూలు వద్ద మహిళలతో సమావేశం.

4.55 – పరవాడ ఎమ్మార్వో ఆఫీసు జంక్షన్ లో అంగన్వాడీలతో భేటీ.

5.10 – పరవాడ ఐఓసి పెట్రోలు బంకు వద్ద రజకులతో సమావేశం.

5.20 – గొర్లవానిపాలెం జిజె కాలేజి వద్ద యువతతో ప్రత్యేక కార్యక్రమం.

5.25 – గొర్లవానిపాలెం బసవతారకం కాలనీ వద్ద మత్స్యకారులతో సమావేశం.

5.30 – గొర్లవానిపాలెం టిడ్కోగృహాల వద్ద గ్రామస్తులతో సమావేశం.

5.35 – గొర్లవానిపాలెం గౌతులచ్చన్న జంక్షన్ లో కాపులతో సమావేశం.

5.50 – గొర్లవానిపాలెంలో స్థానికులతో సమావేశం.

6.05 – చింతలగొర్లవానిపాలెంలో స్థానికులతో సమావేశం.

6.15 – గొర్లవానిపాలెం లారెన్స్ ల్యాబ్స్ ఎన్క్లేవ్ వద్ద స్థానికులతో సమావేశం.

6.25 – జాజులవానిపాలెంలో శాలివాహనులతో సమావేశం.

6.55 – దేశపట్నూరిపాలెంలో స్థానికులతో సమావేశం

రాత్రి

7.10 – స్టీల్ ప్లాంట్ గేటు వద్ద విశాఖ స్టీల్ కార్మికులతో సమావేశం.

7.30 – గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

7.40 – సెక్టార్ 10 బస్టాప్ వద్ద స్థానికులతో మాటామంతీ.

8.10 – సాయిబాబా గుడివద్ద స్థానికులతో మాటామంతీ.

8.55 – సెక్టార్ – 5 షాపింగ్ కాంప్లెక్స్ వద్ద స్థానికులతో మాటామంతీ.

9.10 – సిడబ్ల్యుసి-1 వద్ద విడిదికేంద్రంలో బస.

******


More Telugu News