Daggubati Purandeswari: మాతో తెగదెంపులు చేసుకున్నట్టు జనసేన ఎక్కడైనా చెప్పిందా?: పురందేశ్వరి

  • త్వరలో ఏపీలో ఎన్నికలు
  • ఏపీలో జనసేనతో పొత్తు ఉందన్న పురందేశ్వరి
  • పొత్తులపై బీజేపీ హైకమాండ్ దే తుది నిర్ణయం అని వెల్లడి 
Purandeswari talks about alliance with Janasena

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తమ పొత్తులను బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. ప్రస్తుతానికి జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని, తమతో తెగదెంపులు చేసుకున్నట్టు జనసేన ఎక్కడైనా చెప్పిందా? అని ప్రశ్నించారు. 

ఇక, ఇతర అంశాలపైనా పురందేశ్వరి స్పందించారు. ఏపీ రాజధాని అమరావతేనని కేంద్రం పార్లమెంటు సాక్షిగా ప్రకటించిందని, రాజధాని అమరావతికి కేంద్రం నిధులు కూడా ఇచ్చిందని వెల్లడించారు. పోలవరం నిర్మాణంలో ప్రతి పైసా కేంద్రానిదేనని, త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని తెలిపారు. 

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా బీజేపీని సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏలూరు జిల్లా దండమూడిలో జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఏపీలో దొంగ ఓట్లపై తాము కూడా పోరాటం చేస్తున్నామని, నకిలీ ఐడీలతో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని పురందేశ్వరి ఆరోపించారు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ కు కూడా వివరించామని తెలిపారు. రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం చేయలేని వైసీపీ అవసరమా? అని పురందేశ్వరి ప్రశ్నించారు. 

More Telugu News