KTR: గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్నా: కేటీఆర్

  • ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలేనని విమర్శ
  • అలిశెట్టి ప్రభాకర్ కవితను కోట్ చేసిన మాజీ మంత్రి
  • గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో మండిపడ్డ కేటీఆర్
BRS Mla KTR Fires On Governor Speech In Assembly

తెలంగాణ శాసన సభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డానని చెప్పారు. ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసన సభ చరిత్రలోనే విని ఉండమని అన్నారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణాలన్నీచేసి కేవలం పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం విన్నాక కాంగ్రెస్ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు.

శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత తమకు ఉందని, తప్పకుండా నిజాలను బయటపెడతామని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితను ఆయన కోట్ చేశారు. ‘ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరినీ మోసం చేయనని, ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించినందుకు’.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కూడా ఇలాగే ఉందని, గవర్నర్ ప్రసంగం కూడా అలాగే అనిపించిందని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని, తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమేనని కేటీఆర్ పేర్కొన్నారు.


More Telugu News