ganja: మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100 కిలోల గంజాయి స్వాధీనం

  • స్థానిక పోలీసులతో కలిసి స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ సిబ్బంది 
  • రాయగఢ్ నుంచి దూల్ పేట మీదుగా సూరంగల్‌కు గంజాయిని చేర్చినట్లు వెల్లడి
  • యాభై ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీస్ అధికారులు
Ganja seized in Rangareddy district

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులతో కలిసి నార్కోటిక్ సిబ్బంది ఈ గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మొయినాబాద్ మండలం సూరంగల్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉదయం ఐదు గంటలకు ఏఎంఆర్ వెంచర్‌లోని ఓ షెడ్డులో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఒడిశా రాయగఢ్ నుంచి దూల్ పేట మీదుగా సూరంగల్ గ్రామ వెంచర్‌కి గంజాయిని తీసుకు వచ్చినట్లు తెలిపారు. యాభై ప్యాకెట్లను స్వాధీనం చేసుకోగా, ఒక్కో ప్యాకెట్‌లో రెండు కిలోల గంజాయి ఉంటుందన్నారు. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒడిశాకు చెందిన బాబర్ ఖాన్, దూల్ పేటకు చెందిన సతీష్ సింగ్‌లను అరెస్ట్ చేయగా, ఇద్దరు నిందితులు సునీల్ సింగ్, మనోజ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

More Telugu News