G. Kishan Reddy: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్య

  • లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసిన కిషన్ రెడ్డి
  • ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీకి సూచన
  • మూడోసారి మోదీ ప్రభుత్వం వస్తోందని ధీమా
Kishan Reddy talks about alliance in Telangana

రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు, ఇంచార్జిలు, పార్లమెంట్ ప్రబారీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎన్నికలకు బీజేపీ క్యాడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో సమానంగా పోరాటం ఉంటుందన్నారు. లోక్ సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముందని... లోక్ సభ ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలన్నారు. సర్వే సంస్థలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుందన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లో తీసుకువెళతామన్నారు. కొత్తగా ఎన్నికైన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారన్నారు.  కేంద్రంలో మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేయాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News