వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఓటమిపై రోహిత్ శర్మ స్పందన

Rohit sharma talks about overcoming worldcup finals defeat
  • ఫైనల్స్ తరువాత తొలిసారిగా స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
  • వరల్డ్ కప్ ఫైనల్స్ ఓటమి నుంచి కోలుకోవడం కష్టమని వ్యాఖ్య
  • విజయం కోసం టీమిండియా శ్రమించిందన్న అభిమానుల ప్రశంస సాంత్వన కలిగించిందని వెల్లడి
వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్లిన టీమిండియా ఫైనల్స్‌లో ఓటమి చెందడం టీమిండియా క్రీడాకారులను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. అయితే, ఫైనల్స్ తరువాత రోహిత్ తొలిసారిగా మీడియా ముందుకొచ్చాడు. ఫైనల్స్ ఓటమి నుంచి ఇంకా బయటపడలేదని చెప్పుకొచ్చాడు. 

‘‘ఫైనల్స్ ముగిసిన తరువాత ఏం చేయాలనేది తెలియలేదు. నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు మద్దతుగా నిలిచారు. దీంతో, పరిస్థితిని కొద్దిగా తట్టుకోగలిగా. ఓటమిని జీర్ణించుకోవడం తేలికేం కాదు. కానీ జీవితం ముందుకు సాగిపోతుందని తెలుసు. 50 ఓవర్ల క్రికెట్ చూస్తూ పెరిగా. వరల్డ్ కప్ కోసం తీవ్రంగా శ్రమించాం. వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌లో ఏమైనా పొరపాట్లు చేశారా? అని ఎవరైనా అడిగితే మాత్రం అవును మేం కొన్ని తప్పులు చేశాం అంటాను. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ ఆ పొరపాట్లు జరిగాయి. ప్రతిసారీ పర్‌ఫెక్ట్‌గా గేమ్ ఆడలేదు. కానీ, పర్‌ఫెక్ట్ స్థాయికి దగ్గరగా వెళ్లి విజయం సాధించాం. కానీ, ఫైనల్స్ మాత్రం కలిసి రాలేదు’’ అని రోహిత్ పేర్కొన్నాడు.

ఓటమిని అధిగమించడం కొంచెం కష్టమే అయినా బాధ నుంచి బయటపడాలనే యూకేకు వచ్చినట్టు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ కొంత మంది అభిమానులు తన దగ్గరకు వచ్చి మ్యాచ్‌లో విజయం కోసం క్రీడాకారులు పడ్డ శ్రమను అభినందిస్తుంటే కాస్త రిలీఫ్‌గా ఉందని వ్యాఖ్యానించారు.
Advertisement
Rohit Sharma
Team India
Cricket

More Telugu News