Nara Lokesh: వాళ్లు సంతోషంగా ఉంటేనే ఇల్లు, రాష్ట్రం బాగుంటాయి: నారా లోకేశ్

  • ఉమ్మడి విశాఖ జిల్లాలో లోకేశ్ యువగళం
  • పాయకరావుపేట నియోజకవర్గంలో మహాశక్తితో లోకేశ్ కార్యక్రమం
  • మహిళలతో ముఖాముఖి నిర్వహించిన లోకేశ్
  • లోకేశ్ కు సమస్యలు విన్నవించిన మహిళలు
  • టీడీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలను ఆదుకుంటామన్న లోకేశ్ 
Nara Lokesh held meeting with women in Payakaraopeta constituency

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. పాయకరావుపేట నియోజకవర్గంలో మహాశక్తితో లోకేశ్ కార్యక్రమంలో భాగంగా నారా లోకేశ్ మహిళలతో సమావేశమయ్యారు. చిన్నదొడ్డిగల్లు విడిది కేంద్రం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు లోకేశ్ ఎదుట తమ సమస్యలు తెలియజేశారు.

దిశ ఉందంటున్నా మాకు రక్షణేది?: మహిళలు

జగన్ మహిళల స్వయం ఉపాధి కోసం ఎటువంటి సాయం అందించడం లేదు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మహిళలకు జగన్ హయాంలో భద్రత లేదు. దిశా ఉంది అని చెబుతున్నా మాకు ఎటువంటి రక్షణ లేదు. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచేసి బ్రతకలేని పరిస్థితి తెచ్చారు. జగన్ ప్రభుత్వం చంద్రన్న బీమా రద్దు చేసింది. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే కుటుంబానికి ఎటువంటి సాయం అందడం లేదు. 

డ్వాక్రా వ్యవస్థను జగన్ నాశనం చేశాడు. అభయహస్తం నిధులు కూడా ప్రభుత్వం తీసుకుంది. అనేక నిబంధనలు పెట్టి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని జగన్ నిర్వీర్యం చేశాడు. ఫీజులు కట్టకపోతే మార్కు లిస్టులు ఇవ్వబోమని కాలేజ్ యాజమాన్యాలు అంటున్నాయి. జాబ్ క్యాలెండర్ ఇస్తానని సాక్షి క్యాలెండర్ ఇస్తున్నాడు జగన్. ఉచితంగా ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి జగన్ మమ్మల్ని మోసం చేశాడు. 

మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు ఇళ్లు కేటాయించాలి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు" అంటూ పాయకరావుపేట నియోజకవర్గం మహిళలు వివరించారు.


మహిళల సమస్యల పట్ల లోకేశ్ స్పందన

మహిళలు లేనిది లోకం లేదు. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలు. మహిళలు సంతోషంగా ఉంటే ఇల్లు, రాష్ట్రం బాగుంటాయి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్ గారు. మహిళల్ని ఆర్దికంగా బలోపేతం చెయ్యడానికి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు గారు. దీపం పథకం ద్వారా లక్షలాది గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది చంద్రబాబు గారు. పసుపు - కుంకుమ ఇచ్చింది చంద్రబాబు గారు. 

కానీ, జగన్ మాయ హామీలు ఇచ్చి మహిళల్ని మోసం చేశాడు. మద్యపాన నిషేధం అన్న జగన్ ఇప్పుడు జే బ్రాండ్లు అమ్మి మహిళల పసుపు - కుంకుమ చెరిపేస్తున్నాడు. అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ అన్నాడు... మరి ఇచ్చాడా? 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు... ఇచ్చాడా? 

 పాదయాత్ర లో మహిళలు పడుతున్న కష్టాన్ని నేను చూసాను. మీ కన్నీళ్లు తీర్చే బాధ్యత నాది. టీడీపీ - జనసేన కలిసి మహాశక్తి ప్రకటించాం.

మహాశక్తి పథకం కింద...
 
1) ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు.
2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు.
3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం... అని లోకేశ్ వెల్లడించారు.

జగన్ ను నమ్మేదెవరు?

జగన్ ని సొంత తల్లి, చెల్లి నమ్మడం లేదు. తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యని వాడు రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడా? నా తల్లిని, భార్యని వైసీపీ వాళ్లు అవమానించారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం అని బెదిరించారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. బాధితుల తరపున పోరాడితే మాపై కేసులు పెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం. 

టీడీపీ - జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిశ్రమలు తీసుకొచ్చి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. నేను తిరుపతి కి ఫాక్స్ కాన్ అనే మొబైల్ తయారీ కంపెనీ తీసుకొస్తే ఇప్పుడు అక్కడ 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన కియాలో ఎంతో మంది మహిళలు పనిచేస్తున్నారు. స్వయం ఉపాధి కోసం సాయం అందిస్తాం. స్కూల్ యూనిఫాం కుట్టే బాధ్యత మహిళలకు ఇచ్చేలా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం. 

మహిళల్ని గౌరవించడం , వారి విలువ తెలిసేలా చిన్న నాటి నుండే పాఠ్యాంశాలు ప్రవేశపెడతాం. జగన్ వి మాయ మాటలు... అసలు దిశ చట్టమే లేదు. వైసీపీ నాయకులే మహిళల్ని అవమానపరుస్తూ మాట్లాడితే ఇక బయట రక్షణ ఎలా ఉంటుంది?

More Telugu News