ICC: ఐసీసీ కొత్త రూల్... మైదానంలో టైమ్ వేస్ట్ చేయడం ఇక కుదరదు!

  • ఓవర్ కు ఓవర్ కు మధ్య 60 సెకన్ల వ్యవధి
  • ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపు కొత్త ఓవర్ ప్రారంభించాలంటున్న ఐసీసీ
  • వ్యవధి దాటితే రెండు హెచ్చరికలు... 5 పరుగుల జరిమానా
  • తొలుత ప్రయోగాత్మకంగా పరిశీలన
ICC brings new rule to control time waste between overs by fielding side

క్రికెట్ మ్యాచ్ లో ఓవర్ పూర్తయ్యాక మళ్లీ ఓవర్ వేసేందుకు కొంత వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలో కెప్టెన్లు ఫీల్డింగ్ మోహరింపులు చేస్తుంటారు. దాంతో కొంత సమయం వృథా అవుతుంటుంది. దీన్ని అరికట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త రూల్ తీసుకువస్తోంది. 

ఈ రూల్ ప్రకారం ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్ల లోపు కొత్త ఓవర్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ రూల్ అమలు చేసేందుకు ఓ ఎలక్ట్రానిక్ క్లాక్ ను స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. ఇది 60 నుంచి 0 వరకు కౌంట్ డౌన్ చేస్తుంది. ఫీల్డింగ్ జట్లు నిర్ణీత సమయంలోపు కొత్త ఓవర్ లో తొలి బంతిని విసరలేకపోతే ఆ జట్టుకు రెండు హెచ్చరికలు జారీ చేస్తారు. తద్వారా ఐదు పరుగుల జరిమానా విధించే వీలుంటుంది. 

అయితే, వికెట్  పడినప్పుడు మైదానంలోకి కొత్త బ్యాట్స్ మన్ వచ్చిన సమయంలో ఈ నిబంధన వర్తించదు. డ్రింక్స్ సమయంలోనూ, గాయపడిన ఆటగాడు మైదానంలో చికిత్స పొందేందుకు అంపైర్లు అనుమతించినప్పుడు, ఫీల్డింగ్ జట్టుకు సంబంధించని కారణాలతో సమయం వృథా అయినప్పుడు కూడా ఈ నిబంధన వర్తించదు. 

41.9 నిబంధన కింద ఈ కొత్త రూల్ తెచ్చేందుకు ఐసీసీ కసరత్తులు చేస్తోంది. తొలుత దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు జరిగే దాదాపు 59 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఈ కొత్త రూల్ ను అమలు చేసి పరిశీలిస్తారు. డిసెంబరు 12న వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే తొలి టీ20 ద్వారా ఈ నూతన నిబంధన తీసుకురానున్నారు.

More Telugu News