Yuva Galam Padayatra: 3 వేల కిలోమీటర్లకు చేరుకున్న యువగళం పాదయాత్ర.. పైలాన్ ఆవిష్కరణలో కదంతొక్కిన అభిమానులు

Yuvagalam Pylon Unveiled At Rajula Kotturu Kakinada Dist

  • పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన బ్రాహ్మణి, దేవాన్ష్, భరత్, మోక్షజ్ఞ తదితరులు
  • జనసంద్రంగా మారిన రాజులకొత్తూరు
  • ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటెత్తిన అభిమానులు, కార్యకర్తలు
  • అన్న కేంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని హామీనిస్తూ శిలాఫలకం

తెలుగుదేశం యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజులకొత్తూరు వద్ద పైలాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి లోకేశ్‌తోపాటు ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ, చిన్నల్లుడు భరత్, బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తదితరులు హాజరయ్యారు. 

పైలాన్ ఆవిష్కరణ నేపథ్యంలో తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. అనంతరం లోకేశ్‌తో కలిసి కుటుంబ సభ్యులు అడుగులు వేశారు. యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలురాయికి చేరుకున్న సందర్భంగా యువగళం బృందాలు ఆనందంతో కేరింతలు కొట్టాయి. వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల రాకతో జాతీయ రహదారి కోలాహలంగా మారింది. లోకేశ్‌కి సంఘీభావం తెలిసిన టీడీపీ ముఖ్యనేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో రాజుల కొత్తూరు జనసంద్రాన్ని తరలించింది. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజలే సైన్యంగా యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయికి చేరిందన్నారు. ఈ మజిలీకి గుర్తుగా తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో వైసీపీ సర్కారు మూసివేసిన పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించినట్టు లోకేశ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News