Nara Lokesh: 3 వేల కి.మీ పూర్తి చేసుకున్న లోకేశ్ పాదయాత్ర... రేపు పైలాన్ ఆవిష్కరణకు నారా బ్రాహ్మణి, దేవాన్ష్

  • నేడు తుని నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • ఇప్పటివరకు 3,006 కి.మీ నడిచిన లోకేశ్
  • రేపు యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం
Nara Lokesh Yuvagalam details

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర నేటితో 3 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. లోకేశ్ పాదయాత్ర 218వ రోజు తుని నియోజకవర్గం ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా... ఒంటిమామిడి తొండంగి, శృంగవృక్షం, వలసపాకల, టి.తిమ్మాపురం మీదుగా తేటగుండ విడిది కేంద్రానికి చేరుకుంది. 

యువగళం పాదయాత్రలో 219వ రోజు (సోమవారం) చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. యువగళం పాదయాత్ర 3 వేల కి.మీ చేరుకున్న సందర్భంగా తేటగుంట యనమల అతిథిగృహం వద్ద లోకేశ్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ హాజరు కానున్నారు. 

లోకేశ్ పాదయాత్ర సోమవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఉభయగోదావరి జిల్లాల నాయకులు, కార్యకర్తలు లోకేశ్ కు వీడ్కోలు పలకనుండగా, యువనేతకు భారీ స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, తుని నియోజకవర్గం శృంగవృక్షం వద్ద కాకినాడ సెజ్ బాధిత రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. 

రానున్నది నిశ్శబ్ద విప్లవం

రాష్ట్రంలో రానున్నది నిశ్శబ్ధ విప్లవం, జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయం. కాకినాడ సెజ్ కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారు. కాకినాడ సెజ్ బాధిత రైతుల కష్టాలు నాకు తెలుసు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కంపెనీలు తీసుకొచ్చి... స్థానికంగా భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల వారికి ఉద్యోగాలు కల్పిస్తాం. మూడు నెలలు ఓపిక పట్టండి, నేను ఇచ్చిన హామీలు అన్నీ నిలబెట్టుకుంటాను. 

రాబోయేది ప్రజా ప్రభుత్వం. రైతులు ఎవరికైతే నష్ట పరిహారం అందలేదో వారికి నష్ట పరిహారం అందిస్తాం. కంపెనీల నుండి వచ్చే కలుషిత నీరు బయటకు రాకుండా శుద్ది చేస్తాం. ఎన్ని కోట్లు ఖర్చు అయినా అధునాతన టెక్నాలజీతో ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. ఉపాధి ఎంత ముఖ్యమో, కాలుష్యం కలిగించని కంపెనీలు తీసుకురావడం అంతే ముఖ్యం.

జగన్ మాదిరి దొంగ హామీలు ఇవ్వను

అధికారంలోకి రావడం లక్ష్యంగా ఆ రోజు జగన్ ఎకరానికి రూ.75 లక్షలు ఇస్తామని మోసం చేశాడు. నేను అలాంటి దొంగ హామీలు ఇవ్వను. సెజ్ రైతులు న్యాయం కోసం పోరాడితే కేసులు పెట్టి వేధిస్తోంది ఈ వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం ప్రజలే చెబుతారు. రైతులకు భూమిపై అనుబంధం ఉంటుంది. అలాంటి భూమిని వైసీపీ మంత్రి మాయా రాజా, వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ కోసం దోచుకుంటున్నారు.  

మంత్రి దాడిశెట్టి రాజా, ఆయన అనుచరులు కలిసి దాదాపు 800 ఎకరాల సెజ్ భూములు కొట్టేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. కంపెనీల కోసమే సెజ్... రియల్ ఎస్టేట్ కోసం కాదు... టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ వేసి మంత్రి, వైసీపీ నాయకులు దోచుకున్న భూములు వెనక్కి తీసుకుంటాం. దాడిశెట్టి రాజా మాయా రాజా... ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చాడు. మంత్రి అయ్యాక మర్చిపోయాడు. 

రైతులపై అక్రమ కేసులు ఎత్తేస్తాం

సెజ్ కి భూములు ఇవ్వని రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు అన్నింటినీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తేస్తాం. ఆక్వా రంగానికి జోన్, నాన్ జోన్ అని సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50 కే అందిస్తాం. హేచరీస్ కి కూడా సబ్సిడీలు అందించి ప్రోత్సహిస్తాం. సెజ్ కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో వారికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది.

దెబ్బతిన్న వరిపొలాన్ని పరిశీలించిన లోకేశ్

తుని నియోజకవర్గం ఒంటిమామిడి సమీపంలోని తుపాను కారణంగా దెబ్బతిన్న వరిపొలాలను లోకేశ్ నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా, పంట నష్టపోయిన కౌలు రైతులు కాకాడ సత్యనారాయణ, యనమల వీరబాబు, ఎన్నా బాబ్జి మాట్లాడుతూ... పంట చేతికొచ్చే సమయంలో తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. వారం రోజులు గడచినా తమ పొలాల వద్దకు వచ్చి చూసిన నాథుడు లేడని వాపోయారు. ఎకరాకు రూ.30వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, కష్టమంతా తుపాను పాలయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నారా లోకేశ్ స్పందిస్తూ...

ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో వెనువెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిసి హడావిడిగా బయటకొచ్చి తూతూ మంత్రపు పరామర్శలు చేశారు. పంటల బీమా సొమ్మును తామే చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 16 మంది రైతులకు మాత్రమే బీమా చెల్లించిందంటే రైతులపట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. ప్రకృతి వైపరీత్యాల్లో పంటలు దెబ్బతిన్న సమయంలో కౌలు రైతులకే పరిహారం అందేలా చట్టాన్ని సవరిస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఈరోజు నడిచిన దూరం 16.3 కి.మీ.*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 3,006.7 కి.మీ.*

*219వరోజు (11-12-2023) యువగళం వివరాలు*

*తుని / పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు*

*ఉదయం*

8.00 – తేటగుంట పంజాబీ దాబా వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.15 – తేటగుంట యనమల గెస్ట్ హౌస్ వద్ద యువగళం 3వేల కి.మీ.లు అధిగమించిన సందర్భంగా పైలాన్ ఆవిష్కరణ.

9.30 – తేటగుంట పద్మనాభ ఫంక్షన్ హాలు వద్ద డాక్టర్లతో సమావేశం.

11.30 – చామవరం గేటు వద్ద స్థానికులతో సమావేశం.

11.45 – ఎస్. అన్నవరం సాయివేదిక వద్ద భోజన విరామం.

మధ్యాహ్నం

2.00 – ఎస్.అన్నవరం సాయివేదిక వద్ద కాపు సామాజికవర్గీయులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – ఎస్.అన్నవరం సాయివేదిక వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.30 – తుని హెచ్ పి పెట్రోలు బంకు వద్ద స్థానికులతో మాటామంతీ.

4.40 – తుని ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ లో లేబర్ యూనియన్ ప్రతినిధులతో భేటీ.

4.55 – తుని శ్రీరామ థియేటర్ వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

5.25 – తుని గొల్ల అప్పారావు సెంటర్ లో స్థానికులతో సమావేశం.

5.30 – పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశం.

5.50 – పాయకరావుపేట జుడియో షోరూమ్ వద్ద స్థానికులతో సమావేశం.

6.20 – పాయకరావుపేట ట్రాన్స్ కో కార్యాలయం వద్ద స్థానికులతో సమావేశం.

6.30 – పాయకరావుపేట హైవే ముఖద్వారం వద్ద స్థానికులతో సమావేశం.

రాత్రి

7.00 – పి.ఎల్ పురం వద్ద యువతతో సమావేశం.

7.30 – సీతారాంపురంలో స్థానికులతో సమావేశం.

8.00 – నామవరం క్యాంప్ సైట్ వద్ద విడిది కేంద్రంలో బస.

******

More Telugu News