K Kavitha: సింగరేణి అంటే సింహగర్జన.. అదే స్ఫూర్తితో పని చేస్తూ సంస్థను కాపాడుకోవాలి: ఎమ్మెల్సీ కవిత

  • సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమన్న కవిత
  • అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించామన్న కవిత
  • కేసీఆర్ చేసిన పనులను కార్మికులకు సరిగ్గా చెబితే టీబీజీకేఎస్‌కు ఎదురు ఉండదదని వ్యాఖ్య
MLC Kavitha meeting with Coal mining workers

కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వబోమని... సింగరేణి అంటే సింహగర్జన అని, అదే స్ఫూర్తితో పని చేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం గురువారం టీబీజీకేఎస్ సంఘ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమన్నారు. సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో బొగ్గు గని కార్మికులు ముఖ్య పాత్రను పోషించారని ప్రశంసించారు. సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్ఫూర్తి జాతీయ సంఘాలకు లేదన్నారు. బొగ్గు గనుల్లో కార్మికుల కష్టం తెలంగాణలో వెలుగులు నిండేందుకు కారణమవుతుందన్నారు.

అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించామని, ఈ సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తామనడంలో సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌లా పని చేయాలని సూచించారు. మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామని, త్వరలో తమ సంఘం మ్యానిఫెస్టోను విడుదల చేస్తుందన్నారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ వంటి జాతీయ సంఘాలు సింగరేణి హక్కులను ఏనాడూ కాపాడలేదని ఆరోపించారు. భవిష్యత్తులోనూ సంఘాలను సింగరేణి ఎదుగుదల కోసం ఏమీ చేయలేవన్నారు.

తమకు పోరాటాలు కొత్త కాదన్నారు. కార్మికుల హక్కులను సాధించే వరకు విశ్రమించేది లేదని హామీ ఇచ్చారు. కార్మికులు ఆర్థికంగా ఎదిగేలా చేయడమే కాకుండా ఆత్మగౌరవం ఇవ్వాలన్న ఆలోచనతో కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. సింగరేణి పనితీరును మెరుగుపర్చడానికి, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ చేసిన మంచి పనులను కార్మికుల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేసీఆర్ చేసిన పనులను కార్మికులకు సరిగ్గా చెబితే టీబీజీకేఎస్‌కు ఎదురు ఉండదన్నారు.

More Telugu News