Seethakka: ములుగు నియోజకవర్గ ప్రజల సేవకురాలిని..: సీతక్క

  • తెలంగాణలో ప్రజా సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేస్తామన్న ములుగు ఎమ్మెల్యే
  • మరికాసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సీతక్క
  • పదవి దక్కడం సంతోషంగా ఉందన్న సీనియర్ లీడర్
Seethakka Reaction on Minister Post

ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా తాను ములుగు నియోజకవర్గ ప్రజలకు సేవకురాలినేనని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. మంత్రి పదవి దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే తెలంగాణ ప్రజలు తనపై మరింత పెద్ద బాధ్యతను పెట్టారని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వాన్ని తరిమికొట్టి ప్రజాస్వామ్యానికి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. ప్రజలంతా ఆశించిన సంక్షేమ రాజ్యం తీసుకొస్తామని, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని సీతక్క వెల్లడించారు.

2004 నుంచి 2011 వరకు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ విధానాలను ఇప్పుడు కూడా అమలు చేస్తామని వివరించారు. సంక్షేమ పాలన అందించడంలో అన్ని వర్గాల మద్దతు తమకు కావాలని, అందరూ తమకు సహకరించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయని సీతక్క చెప్పారు. రోడ్డు రవాణా సమస్యలతో పాటు ఏజెన్సీ ఏరియాల్లో జనం పేదరికంలో మగ్గుతున్నారని అన్నారు.

ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను డెవలప్ చేసి గొప్పగా చూపించుకోవడం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ సీతక్క ఈ అభిప్రాయాలను వెల్లడించారు.

More Telugu News