Revanth Reddy: కీలక మలుపు... ఢిల్లీకి రావాలని అధిష్ఠానం నుంచి రేవంత్ రెడ్డికి పిలుపు

  • హోటల్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన రేవంత్ రెడ్డి
  • నిన్నటి నుంచి హైదరాబాద్ హోటల్లోనే ఉన్న రేవంత్ రెడ్డి
  • కాసేపట్లో సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న కేసీ వేణుగోపాల్
Revanth Reddy to go Delhi after call from high command

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఢిల్లీలో అధిష్ఠానం చర్చోపచర్చల నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డికి పిలుపు వచ్చింది. ఉదయం నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్‌లు సీఎం అభ్యర్థిత్వంపై చర్చలు జరుపుతున్నారు. సీఎం రేసులో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో ఢిల్లీ పెద్దలు చర్చలు జరిపారు. సాయంత్రం కేసీ వేణుగోపాల్ నివాసంలో చర్చించారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి పిలుపు రావడంతో... నిన్నటి నుంచి హోటల్ ఎల్లాలో ఉన్న ఆయన కాసేపటి క్రితం అక్కడి నుంచి విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి... కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నారు.

ఓ వైపు సీఎం పదవి కోసం మల్లు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఇలాంటి సమయంలో రేవంత్ కు పిలుపు రావడం కీలక అంశంగా మారింది. మరోవైపు కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అభ్యర్థిపై ప్రకటన చేసే అవకాశముంది.

More Telugu News