Bus Accident: థాయ్ లాండ్ లో చెట్టును ఢీ కొట్టి రెండు ముక్కలైన బస్సు.. 14 మంది మృతి

  • ప్రమాదంలో మరో 20 మందికి గాయాలు
  • అతివేగమే కారణమని ప్రాథమికంగా తేల్చిన అధికారులు
  • సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రమాదం
14 Killed After Bus Loses Control And Hits Tree In Thailand

ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటన థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘోరం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం రెండుగా చీలిపోయింది. కొంత భాగం నుజ్జునుజ్జుగా మారిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికుల్లో 14 మంది స్పాట్ లోనే చనిపోగా.. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రచౌప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. వేగం కంట్రోల్ కాకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టిందని వివరించారు. అయితే, ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి విచారణ తర్వాతే ప్రమాదానికి అసలు కారణం తెలుస్తుందని అధికారులు వివరించారు.



More Telugu News