Supreeta: నన్నెందుకు వేధిస్తున్నారు? నేనేం తప్పు చేశా?.. సురేఖావాణి కూతురి ఆవేదన

  • బీఆర్ఎస్ గెలవాలంటూ ఎన్నికల ముందు సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత ఇన్‌స్టా రీల్స్
  • తాజాగా రేవంత్ రెడ్డితో ఫొటో పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన వైనం
  • తల్లీకూతుళ్లపై నెట్టింట విపరీతంగా ట్రోలింగ్, సుప్రీత ఆవేదన 
surekha vani daughter Supreeta hurt by trolling over current political situation

టాలీవుడ్ నటి సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. కూతురితో సమానంగా రీల్స్ చేస్తూ సురేఖావాణి కూడా నెట్టింట హంగామా చేస్తుంది. గతంలో షేర్ చేసిన వీడియోల కారణంగా తల్లీకూతుళ్లిద్దరూ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సుప్రీత, ఆమె తల్లి సురేఖవాణిని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 

ఎన్నికలకు మునుపు సురేఖావాణి, సుప్రీత.. బీఆర్ఎస్ గెలవాలని కారు ముందు నిలబడి రీల్స్ చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తాము కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దీన్ని అవకాశంగా తీసుకుని నెటిజన్లు రెచ్చిపోయి ట్రోల్ చేస్తుండటంతో ఆవేదన చెందిన సుప్రీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను తొలుత బీఆర్ఎస్‌కు సపోర్టు చేశా. మునుపటి ఇన్‌స్టా స్టోరీలో కొత్త సీఎంకు శుభాకాంక్షలు చెప్పా. ఇంత మాత్రానికే నన్ను ట్రోల్ చేయడం అనవసరం. నేను మీకేం అన్యాయం చేశా? నాపై ఎందుకింత ద్వేషం? మీ ట్రోలింగ్ నా మానసిక ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపిస్తోందో తెలుసా?’’ అంటూ సుప్రీత పోస్ట్ పెట్టారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

More Telugu News