Cyclone Michaung: 'మిగ్జామ్ ' తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది: చంద్రబాబు

  • ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్న చంద్రబాబు
  • రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వెల్లడి
  • ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి
  • తుపాను బాధితులకు సాయపడాలని టీడీపీ శ్రేణులకు పిలుపు
Chandrababu responds on Cyclone Michaung

రాష్ట్రంపై 'మిగ్జామ్' తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. 

గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా... ప్రభుత్వం తగు రీతిలో స్పందించలేదని అన్నారు. ధాన్యం కొనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని... సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

పంట చేతికి వచ్చే సమయంలో తుపాను అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని... ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని అన్నారు. తుపాను బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

More Telugu News