Bus Accident: హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో అగ్నిప్రమాదం.. ఒకరి సజీవ దహనం

  • నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ఘటన
  • 38 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు
  • మంటలు గుర్తించి రోడ్డు పక్కన ఆపేసి ప్రయాణికులను అప్రమత్తం చేసిన డ్రైవర్
  • అతి కష్టం మీద తప్పించుకున్న ప్రయాణికులు
  • కాలి బూడిదైన బస్సు
Private bus towards Nellore caught fire in Nalgonda dist

హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం కాగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. నల్లొండ జిల్లా మర్రిగూడ వద్ద జరిగిందీ ఘటన. శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు గతరాత్రి 38 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి నెల్లూరు బయలుదేరింది. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రలో ఉండగా నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. 

అయితే, మంటలు వేగంగా విస్తరించి బస్సును చుట్టేయడంతో కొందరు ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. మరికొందరు మాత్రం అతికష్టం మీద తప్పించుకోగలిగారు. ఒక ప్రయాణికుడు మాత్రం తప్పించుకోలేక సజీవ దహనమయ్యాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన ప్రయాణికుడిని గుర్తించాల్సి ఉంది.

More Telugu News