Team India: మన బౌలర్లు కూడా అదుర్స్... టీమిండియాదే టీ20 సిరీస్

  • రాయ్ పూర్ లో టీమిండియా జయభేరి
  • 20 పరుగుల తేడాతో ఆసీస్ పై విజయం
  • సిరీస్ 3-1తో టీమిండియా కైవసం
  • డిసెంబరు 3న బెంగళూరులో ఇరు జట్ల మధ్య చివరి టీ20
Team India clinches T20 Series against Australia

రాయ్ పూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా 20 పరుగుల తేడాతో గెలిచింది. ఈ పోరులో ఏమంత కష్టసాధ్యం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ను టీమిండియా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. 175 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యారు. ఈ మ్యాచ్ లో నెగ్గిన టీమిండియా... 5 మ్యాచ్ ల సిరీస్ ను 3-1తో చేజిక్కించుకుంది. 

టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3, దీపక్ చహర్ 2, రవి బిష్ణోయ్ 1, అవేశ్ ఖాన్ 1 వికెట్ తీశారు. ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ చివర్లో పోరాడినా ఫలితం లేకపోయింది. వేడ్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 36 పరుగులు చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 31, బెన్ మెక్ డెర్మట్ 19, మాథ్యూ షార్ట్ 22, టిమ్ డేవిడ్ 19 పరుగులు చేశారు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. 

సిరీస్ ఫలితం తేలిన నేపథ్యంలో, ఇరు జట్ల మధ్య నామమాత్రపు చివరి టీ20 మ్యాచ్ డిసెంబరు 3న బెంగళూరులో జరగనుంది.

More Telugu News