Konda Surekha: బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ కారు ఆపి మరీ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కొండా సురేఖ

  • వరంగల్‌లో ఘటన
  • తనకు తారసపడిన నరేందర్ దగ్గరికెళ్లి మరీ వార్నింగ్
  • బెదిరించుడు, భయపెట్టుడు చేస్తే ఒళ్లు పికులద్దని హెచ్చరిక
  • బీజేపీతో కలిసిపోవడానికి సిగ్గులేదా? అని నిలదీత
Congress candidate Konda Surekha strong warning to Narendar Nannapuneni

వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కారులో వెళ్తుండగా నరేందర్ తారసపడడంతో కారు ఆపి మరీ ఆయనకు హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీసే కుట్రలను మానుకోవాలని ఫైరయ్యారు. తమ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

నిన్న వరంగల్ పెరుకవాడ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల దాడిలో గాయపడిన కార్యకర్తలను కుమార్తె సుస్మిత పటేల్‌తో కలిసి సురేఖ పరామర్శించారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. నన్నపునేని దగ్గరికెళ్లిన సురేఖ ‘‘ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రదీప్‌రావు కలిసిపోవడానికి సిగ్గులేదా? నిన్ను ఈ స్థాయికి ఎవరు తీసుకొచ్చారో తెల్వదా?’’ అని ప్రశ్నించారు.

దీంతో పక్కనే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త సురేఖతో వాదనకు దిగుతూ చేయి లేపగా, ఆ వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే పనిచేశారు. సురేఖ మళ్లీ మాట్లాడుతూ.. చెప్పు తెగుద్ది అని వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగక.. భయపెట్టుడు, బెదిరించుడు చేస్తే ఒళ్లు పికులుద్ది అని మండిపడ్డారు. దీంతో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ నరేందర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


More Telugu News