Telangana Assembly Election: ఎమ్మెల్సీ కవిత, రేవంత్ రెడ్డిలపై ఫిర్యాదులు వచ్చాయి.. ఎఫ్ఐఆర్ నమోదు జరిగింది: వికాస్ రాజ్

  • మరికొన్ని ఫిర్యాదులు రావడంతో ఆయా డీఈవోలకు పంపించినట్లు వెల్లడి
  • తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందన్న వికాస్ రాజ్
  • పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరగవలసి ఉందని వ్యాఖ్య
Vikasraj says fIR filed on BRS MLC Kavitha

తెలంగాణలో పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ... సమస్య రావడంతో ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మార్చడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కానీ పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరింతగా పెరగవలసి ఉందన్నారు. ఎపిక్ కార్డు లేకపోతే 12 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు ఉన్నాయని, వాటిని గుర్తింపు కార్డులుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని సూచించారు.

ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. డీఈవోకు నివేదించామని, ఎఫ్ఐఆర్ కూడా నమోదయినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఫిర్యాదు వస్తే ఎఫ్ఐఆర్ నమోదయిందన్నారు. మరికొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయని, ఆయా డీఈవోలకు పంపించామని, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

నాగార్జునసాగర్ అంశంపై కూడా సీఈవో స్పందించారు. ఆ విషయాన్ని పోలీసులు చూసుకుంటారని, ఆ అంశంపై రాజకీయ నేతలు తొందరపడవద్దని, తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఎవరూ అతిక్రమించకూడదన్నారు. కాగా, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ వేళ నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. నీటి కోసం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు చొరబడి నాగార్జున సాగర్ డ్యాంకు ముళ్లకంచె ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

More Telugu News