polling: ఎన్నికల ‘సిరా’ ఎక్కడ తయారుచేస్తారంటే..!

  • నకిలీ ఓట్లను అరికట్టేందుకు చేతి వేలిపై గుర్తు
  • 1962 ఎన్నికలలో తొలిసారిగా వినియోగం
  • మైసూరులోని పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీలో తయారీ
  • కెనడా, నేపాల్, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లోనూ ఇదే సిరా వాడకం
Indelible Ink Used Elections

తెలంగాణలో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. లైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓ వ్యక్తి ఓటేశారనడానికి చిహ్నం.. వేలిపై సిరా గుర్తు. ఓటర్ లిస్ట్ లో పేరు చెక్ చేసి, ఓటు వేయడానికి అధికారులు అనుమతివ్వగానే మొదట చేసే పని సదరు ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేయడం. దీనివల్ల ఆ ఓటరు మరోసారి ఓటేయడానికి రాకుండా గుర్తించేందుకు వీలుంటుంది. నకిలీ ఓట్లను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది. వేలిపై రెండు మూడు రోజుల వరకు ఉండే ఈ సిరాను ఎక్కడ తయారు చేస్తారో తెలుసుకుందాం..

భారత ఎన్నికల సంఘం ఈ పద్ధతిని 1962 ఎన్నికలలో ప్రారంభించింది. దశాబ్దాలుగా ఇదే పద్ధతిని కొనసాగిస్తోంది. మొదట్లో ఈ ఇంక్ ను ఆర్ అండ్ డి సంస్థ తయారుచేసేది. ఆ తర్వాత మైసూరులోని పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీ దీని తయారీ బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం సిరా ఇంక్ ఇదే కంపెనీ తయారుచేస్తోంది. ఒక్క మనదేశంలోనే కాదు.. కెనడా, కాంబోడియా, మాల్దీవులు, నేపాల్, దక్షిణాఫ్రికా, టర్కీ సహా పలు దేశాలకు ఈ సిరాను తయారుచేసి పంపిస్తోంది. 

సిల్వర్ నైట్రేట్ సహా పలు రసాయనాల మిశ్రమంతో ఈ సిరాను తయారుచేస్తారు. ఈ సిరా కొన్ని రోజుల వరకు చెరిగిపోదు. 5, 7, 20, 50 ఎంఎల్ బాటిల్స్ లలో ప్యాక్ చేస్తారు. 5 ఎంఎల్ బాటిల్ దాదాపుగా 300 మంది ఓటర్ల వేలిపై గుర్తు వేయడానికి సరిపోతుంది. 10 ఎంఎల్ బాటిల్ తయారీకి దాదాపుగా రూ.127 ఖర్చవుతుంది.

More Telugu News