State Election Commission: ప్రచారం ముగిసింది... సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయవద్దు: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

  • అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం
  • టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్ వర్క్‌లలో ప్రచారం చేయవద్దన్న ఈసీ
  • ఓటరు స్లిప్పులపై పార్టీ గుర్తులు ఉండకూడదన్న వికాస్ రాజ్
EC Vikasraj press meet on polling

ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలో కూడా ఎన్నికల ప్రచారం చేయవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశముందన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వాటిని ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్ వర్క్‌లలో ఎన్నికల ప్రచారం చేయవద్దన్నారు. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదని స్పష్టం చేశారు.

ఇక పోలింగ్ ముగిసిన అర్ధగంట వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించకూడదని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న దాదాపు లక్షన్నర మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు వెల్లడించారు. 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో 7,571 ప్రాంతాల్లో బయట కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రంలోకి గుర్తింపు కార్డు తప్ప... సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకు వెళ్లరాదన్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.737 కోట్ల విలువైన నగదు, బంగారం వంటివి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

More Telugu News