Nara Lokesh: జగన్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఫిక్సయింది.. తాటిపాక సభలో లోకేశ్ వార్నింగ్

  • సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర
  • తాటిపాక సెంటర్‌‌లో జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన టీడీపీ యువనేత
  • బహిరంగ సభకు పోటెత్తిన ప్రజలు
  • చంద్రబాబును జైలుకు పంపి తన యాత్రను ఆపాలని జగన్ భావించారని మండిపాటు
  • టీడీపీకి సంక్షోభాలు కొత్తకాదన్న లోకేశ్
  •  అధికారంలోకి వచ్చాక వడ్డీ సహా చెల్లిస్తామని హెచ్చరిక
Nara Lokesh Warns CM Ys Jagan In Tatipaka Meeting

రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ రోజు తిరిగి ప్రారంభమైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో ఉదయం 10.19 గంటలకు పాదయాత్రలో మళ్లీ తొలి అడుగుపడింది. ఈ క్రమంలో తాటిపాక సెంటర్‌లో జరిగిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సంఘీభావంగా టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. తనపై ఆరు కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం పాదయాత్రను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. చంద్రబాబును జైలుకు పంపితే తన పాదయాత్ర ఆగుతుందని భ్రమపడ్డారని ఎద్దేవా చేశారు. చివరికి అన్నా క్యాంటీన్‌నూ వదలేదని విమర్శించారు. స్కిల్ ఖాతాలో ఒక్క ఆధారమైనా చూపించలేకపోయారని ధ్వజమెత్తారు.

వ్యవస్థలను మ్యానేజ్ చేసి చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కౌంట్‌డౌన్ మొదలైందని మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే ఇక్కడ నిల్చున్నానని తెలిపారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తీసుకుంటానని హెచ్చరించారు.

లోకేశ్ ప్రసంగం పూర్తి పాఠం.. 

 *  సంక్షోభాలు, పోరాటాలు టీడీపీకి కొత్తకాదు. ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు వరకూ అనేక సంక్షోభాలు ఎదుర్కొంది.
*  కష్టాలకు ఎదురునిలబడి పోరాడే దమ్ము మనకి ఉంది.
* యుద్ధం మొదలైంది. సైకో జగన్‌కి ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యింది. 
*  మూడే నెలలు.. మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్.  
*  యువగళం పాదయాత్ర కు 79 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు మీరు నన్ను క్షమించాలి.  
* ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జనవరి 27 న నేను యువగళం పాదయాత్ర ప్రారంభించాను. 
*  యువగళానికి బ్రేకుల్లేవు.. వీక్ ఆఫ్ లేదు, శనివారం, ఆదివారం లేదు. 
*  209 రోజుల పాటు ప్రజల్లో ఉన్నా. 
*  10 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2853 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. 
*  రైతులు, యువత, మహిళలు, ముస్లింలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వ్యాపారులు, ఐటీ ప్రొఫెషనల్స్, భవన నిర్మాణకార్మికులు, న్యాయవాదులు, రవాణారంగ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, ఆర్ఎంపీలతో అనేక ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నాను. టీడీపీ- జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కష్టాలు తీరుస్తా.
*  ప్రతి వంద కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా ప్రత్యేక హామీలు ఇచ్చాను. 
*  యువగళం ప్రజాగళంగా మారింది.
*  నేను పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే సైకో జగన్ అడ్డుకోవడానికి స్కెచ్ లు వేసాడు. 
*  పోలీసుల్ని పంపాడు, పిల్ల సైకోలను పంపాడు.  అయినా మనం తగ్గేదేలేదు. నా మైక్ లాక్కున్నారు ... అన్న ఎన్టీఆర్ ఇచ్చిన గొంతు ఆపే మగాడు పుట్టలేదు. ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర... అడ్డుకుంటే దండయాత్ర.
*  వాలంటీర్ల మీద కేసులు పెట్టాడు, నాయకుల మీద కేసులు పెట్టాడు, నా మీద కేసులు పెట్టాడు అయినా యువగళం ఆగలేదు.
*  ఆఖరికి మన రాముడు చంద్రబాబుని అరెస్ట్ చేసి యువగళం పాదయాత్ర ఆపాడు ఈ సైకో జగన్. 
*   సొంత అమ్మని చూసినా, సొంత చెల్లిని చూసినా సైకో జగన్ కి  భయమే. 
*  స్కిల్ కేసు లో ముందు 3 వేల కోట్ల అవినీతి అన్నారు, ఆ తరువాత తూచ్ 370 కోట్లే అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. అవి కూడా పార్టీ అకౌంట్ లోకి వచ్చాయి అంటున్నారు. 
*  హైకోర్టు లో నిజం గెలిచింది. బెయిల్ ఇస్తూ ఇచ్చిన ఆర్డర్ కాపీ చదివిన ఎవరికైనా జగన్ వ్యవస్థల్ని ఎలా నాశనం చేశాడో అర్థమైంది.
*   తప్పు చేస్తే చంద్రబాబు గారే నన్ను వదిలిపెట్టరు. 
*  ఆఖరికి మా అమ్మ భువనమ్మ, నా భార్య బ్రాహ్మణి పై కూడా కేసులు పెడతాం అరెస్ట్ చేస్తాం అని మంత్రులు మాట్లాడారు. ఆ మంత్రులకు భయం పరిచయం చేసే బాధ్యత నాది.
*  పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. అయినా మన పోరాటం ఆగలేదు.
*  ఉద్యమంలో భాగస్వామ్యమై నిజాన్ని గెలిపించిన అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 
*  జైలర్ ఎవరో తెలుసా?  చంద్రబాబు గారు. మీ తాట తీస్తారు. ఇది ఖాయం రాసిపెట్టుకోండి. 
*  చలి కాలంలో ఫ్యాన్ కి ఉక్కపోత మొదలైంది. మూడు నెలల్లో ఫ్యాన్ మాడిపోవడం ఖాయం.
*  జగన్‌కు ఊరికో ప్యాలస్ ఉంది. ఏదీ 500 కోట్లకు తక్కువ లేదు ఈయన పేదవాడు అంట.  
*  అమర్నాథ్ గౌడ్ లాంటి బీసీ బిడ్డలను ఎంత కిరాతకంగా చంపారో గుర్తుపెట్టుకోండి. 
*  డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, డాక్టర్ అనితారాణి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, చీరాలలో కిరణ్, చిత్తూరు లో ఓం ప్రతాప్, ఇప్పుడు కొవ్వూరులో మహేంద్ర. ఎంత మంది ఎస్సీ బిడ్డల ప్రాణాలు తీశాడో గుర్తుపెట్టుకోండి. 
*  100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. 
*  2వేల కిలోమీటర్ల పాదయాత్రలో మీ కష్టాలు చూశాను. మీ కన్నీళ్లు తుడుస్తాను.  చంద్రబాబు , పవన్ కల్యాణ్ కలిసి మహాశక్తి ప్రకటించారు. 
*  మహాశక్తి పథకం కింద  ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.   
*  గోదావరి నది చెంతనే ఉన్నా రాజోలు నియోజకవర్గంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రజలకు రక్షిత నీరు అందడం లేదు. టీడీపీ- జనసేన  అధికారంలోకి వచ్చిన వెంటనే సురక్షిత తాగునీరు అందిస్తాం.  
*  తూర్పుగోదావరి జిల్లా నుంచి ఐదుగురు మంత్రులు అయ్యారు. కానీ జిల్లాకి చేసింది సున్నా. ఒక  మంత్రి పేషీలో జీతాలు ఇవ్వలేదని పేషీకి తాళం వేశారు. ఇంకో మంత్రి ఖజానా కు కన్నం వేస్తే ఉద్యోగం పోయింది. మిగిలిన వాళ్లకు అసలు వారి శాఖ ఏంటో కూడా తెలియదు. 
*  రాజారెడ్డి రాజ్యాంగం పనైపోయింది... అంబేద్కర్ రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
*  80 ఏళ్ల కార్యకర్త కూడా  బెదిరింపులకు భయపడకుండా తొడకొట్టి సవాల్ చేస్తారు. దట్ ఈజ్ టీడీపీ పవర్. 
*  మూడు నెలలు ఓపిక పట్టండి టీడీపీ కార్యకర్తల్ని వేధించిన వైసీపీ వారికి వడ్డీతో సహా చెల్లిస్తా. రాజోలు లో ఉన్నా రష్యా పారిపోయినా తీసుకొచ్చి లోపలేస్తా.

More Telugu News